రైళ్లు రద్దు: సైన్యం బోట్లు తెప్పించినా..., పులిహోర పంచిన రాజేంద్రప్రసాద్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ - విశాఖపట్నం - సికిందరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు.
ట్రెయిన్ నెంబర్ 07071 హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో నడిచే ప్రత్యేక రైళ్లు, ట్రెయిన్ నెంబర్ 07072 విశాఖపట్నం - సికిందరాబాద్ మధ్య ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.
సత్తెనపల్లి-గుంటూరు-నడికుడి సెక్షన్లలో నీట మునిగిన రైల్వే ట్రాక్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శనివారం ఆయన రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు.
పలు రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులకు ఆహారం, నీటి వసతి కల్పించటంతో పాటు ఆర్టీసి బస్సుల్లో వారిని వారి గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. నడికుడి మార్గంలో, కాజీపేట్ జంక్షన్ పరిధిలోని మార్గాల్లో మొత్తం ఆరు ప్రాంతాల్లో వర్షం కారణంగా రైలు పట్టాలు నీట మునిగాయని, కొన్ని చోట్ల పట్టాలు దెబ్బతిన్నాయన్నారు.
వెంటనే వాటి మరమ్మతులకు కావలసిన సిమెంట్, క్వారీ డస్ట్, ఇసుక వంటి వాటితోపాటు మ్యాన్ పవర్ను వినియోగించుకోవాలని, అందుకు ఇతర జోన్ల సిబ్బందిని కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రధానంగా నడికుడి-గుంటూరు మధ్య రైల్వే ట్రాక్ తీవ్రస్థాయిలో దెబ్బతిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.

ప్రయాణీకులకు నరకం
భాగ్యనగరాన్ని వర్షంతోపాటు మెట్రో రైలు అధికారులు వణికిస్తున్నారు. కాలనీల్లో చేరుతున్న నీరు జనాన్ని భయాందోళనలకు గురిచేస్తోంటే మెట్రో రైలు నిర్మాణాలు జరుగున్న ప్రాంతాల్లో రహదారులపై వాహనచోదకులు భయం, అనుమానాలతో వెళ్తున్నారు.

ఇబ్బందులకు రెండు కారణాలు
భారీగా కురుస్తున్న వర్షాలకు రహదారులు కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. ప్రధాన ప్రాంతాల్లో తారు మొత్తం కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. దీనికి ప్రధాన కారణం రోడ్ల నాణ్యతాలోపాలైతే, మరో కారణం మెట్రో రైలు నిర్మాణ పనులు.

ఆ రోడ్లలో ఇబ్బంది
కూకట్పల్లి నుంచి ఎల్బీనగర్ వరకూ, సికింద్రాబాద్ నుంచి మాదాపూర్ వరకూ, సుల్తాన్ బజార్, కోఠి, జాంబాగ్, నాంపల్లి, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు మరింత పెరిగాయంటున్నారు. రెండురోజుల క్రితం కురిసిన వర్షం లక్డీకాపూల్లోని ఓ గుంతను నింపేయడం, వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో ఏకంగా టోలీచౌకి వరకూ వాహనాలు ఆగిపోయాయి.

నరకయాతన
మెట్రో రైలు పిల్లర్లు, స్టేషన్ పనుల కారణంగా తవ్విన, తవ్వుతున్న గుంతలను మరమ్మతులు చేయకపోవడం, కొత్తగా పనులు చేపట్టిన ప్రాంతాల్లో బ్యారికేడ్లతో ఆక్రమించడంతో రహదారులు దారుణంగా పాడయ్యాయి. ప్రయాణికులు, వాహనచోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధాన కారిడార్లలో రోజూ ప్రయాణిస్తున్న లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఖాళీ చేయండి
భారీ వర్షాలు కురుస్తున్నాయని, కొత్త భవనాల్లోకి నీళ్లొచ్చి గోడలు పడిపోతున్నాయని, డెబ్భై, ఎనభై ఏళ్ల వయస్సున్న ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియదని, ఇప్పటికే బాగా దెబ్బతిన్నాయని, వెంటనే ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుందని, మీకు 24 గంటల సమయం కూడా ఇవ్వమని, సాధ్యమైనంత వేగంగా వెళ్లిపోవాలని అధికారులు పాతబస్తీలోని పురాతన ఇల్లు, భవనాల యజమానులను హెచ్చరిస్తున్నారు.

రంగంలోకి సైన్యం
భారీ వర్షాలతో అస్తవ్యస్తమైన హైదరాబాద్లో వరద సహాయ చర్యల కోసం సైన్యం, విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగాయి.శనివారం బేగంపేట, నిజాంపేట, హకీంపేట, అల్వాల్, ఉప్పల్ ప్రాంతాల్లోని పలు బస్తీలు, కాలనీల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.

సైన్యం సహాయకచర్యలు
జిహెచ్ఎంసీ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నిజాంపేట బండారి లే అవుట్లో ఆహార ప్యాకెట్లు, మెడికల్ కిట్లు
నిజాంపేటలోని బండారీ లేఅవుట్, బేగంపేట పరిధిలోని అల్లంతోట బావి తదితర ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ కిట్లు, ఆహార ప్యాకెట్లు, ఇతర సామగ్రి అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో నాలుగు బృందాల సైన్యంతోపాటు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన రెండు బృందాలు సేవలు అందిస్తున్నాయి. అవసరమైతే అదనపు బృందాలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రక్షణ శాఖ ప్రకటన
ఒక్కోచోట రెండేసి టాస్క్ఫోర్సు బృందాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. నిజాంపేట, అల్వాల్, బేగంపేటల్లో 100 మంది చొప్పున మొత్తం 300 మంది సైనికులు సేవలందిస్తున్నారు. హకీంపేటలో మరో 100మంది సైనికులు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

బోట్లు వినియోగించలేదు
అల్వాల్లో వరదలో చిక్కుకున్నవారికి ఆహారాన్ని అందజేసిన సైన్యం వైద్యసేవలకు కూడా ముందుకొచ్చింది. నిజాంపేటలో రెండు బోట్లను సిద్ధం చేసినా అక్కడ రహదారులపై నీటిమట్టం తగ్గడంతో వాటిని వినియోగించలేదు.

జిహెచ్ఎంసి సహకారంతో..
రాష్ట్ర ప్రభుత్వ, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంతో.. ప్రజలకు అవసరమైన సేవలందించడానికి సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ ప్రజాసంబంధాల అధికారి గేదెల సురేష్ తెలిపారు. జిహెచ్ఎంసి, జాతీయ విపత్తుల నిర్వహణ బృందం సిబ్బందితో 24 గంటలూ సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా జంటనగరాల్లోని అన్ని ప్రాంతాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

తగ్గుముఖం పట్టిన వర్షం
శనివారం వర్షం తెరిపివ్వడంతో పలు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టింది. రాత్రికి వాన లేకపోతే ఆదివారం నాటికి పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వరద అలాగే ఉంది.

బండారీ లే అవుట్లో పరిస్థితి అలాగే
నిజాంపేటలోని బండారీ లే అవుట్లో పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ ఇంకా చాలా వీధుల్లో వరద బెడద వదల్లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 24 వేల ఫ్లాట్లున్నాయి. లక్షమందివరకు నివసిస్తున్నారు. ఐదు రోజులపాటు కురిసిన వర్షానికి చాలా కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. చాలా ఇళ్లకు ఇంకా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు.

కొంత మెరుగైనా..
మరో రెండు, మూడు రోజుల్లో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఆల్విన్ కాలనీ సమీపంలోని ధరణీ నగర్లో ఓ ప్రయివేటు పాఠశాలబస్సుకు శనివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. పిల్లలతో వెళ్తున్న బస్సు వరద నీటిలో చిక్కుకోవడంతో స్థానికులు అప్రమత్తమై రక్షించారు.

మ్యాన్ హోల్లో పడిన యువకుడు
నిజాంపేట శ్రీనివాసనగర్ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంతో వెళుతున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మ్యాన్హోల్కి జారిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని కాపాడారు. కాప్రాలో వర్షానికి గోడ కూలి నలుగురికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.

నిజాంపేటలో మా సాయం
భారీ వర్షాల కారణంగా నిజాంపేటలో పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిజాంపేటలో సహాయక చర్యల్లో పాల్గొంది. ఆల్విన్ కాలనీలో రాజేంద్ర ప్రసాద్ స్వయంగా వరద నీటిలోకి దిగి సాయమందించారు. పులిహోర పొట్లాలు, బిస్కట్లు పంచి పెట్టారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications