మనిషి జీవితంలో వివాహ ఘట్టం అనేది ఎంతో ప్రాధాన్యత
హైదరాబాద్ : మనిషి జీవితంలో వివాహ ఘట్టం అనేది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వివాహం ఎవరి స్థాయిని బట్టి వారు అంతే ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. బందుమిత్రుల సమక్షంలో కన్నుల పండుగగా పెళ్లి జరుపుకోవడం భారతీయుల సంప్రదాయంగా వస్తోంది. పెళ్లి తంతులో వివాహ ఆహ్వాన పత్రాలు అదే వెడ్డింగ్ కార్డ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. పెళ్లి ఆహ్వాన పత్రిక ను బట్టి వధూవరులు ఎంత ఉన్నత స్థితిమంతులో అంచనా వేయవచ్చు. అంతే కాకుండా పెళ్లి పత్రిక ద్వారా వివాహం ఎంత ఆర్బాటంగా జరగబోతోందో కూడా పసిగట్టొచ్చు.
వివాహ ఘట్టంలో పెళ్లి కార్డులకు ఉన్న ప్రత్యేకత అది. ఇక మారుతున్న కాలంతో పాటు పెళ్లి పత్రికల్లో వస్తున్న సమాచారం కూడా మారుతోంది. ఇప్పటి వరకూ పెళ్లి పత్రికలో వధూవరులకు సంబందించిన వివరాలు, వివాహం ఎక్కడ జరగబోతోంది, విందు ఎన్నింటికి, వధూవరుల కుటుంబ సభ్యుల పాక్షిక వివరాలు మాత్రమే ఉండేవి.
ఇప్పుడు ఆ సంప్రదాయం మారుతోంది. సమాజంలో జరుగుతున్న ప్రేరణాత్మక అంశాలను పెళ్లి పత్రికలో ముద్రించి తమ ఉన్నత స్వభావాన్ని చాటుకుంటున్నారు కొందరు. అంతే కాకుండా దేశం లో జరుగుతున్న పరిణామాలను, యుద్ద వాతావరణం, దేశ భక్తి తదితర అంశాలను కూడా పెళ్లి పత్రికలో ముద్రించేదుకు వధూవరులు ఉత్సుకతను చూపిస్తున్నారు.
తాజాగా ఇబ్రహీంపట్నం, కొంగర్ కలాన్ వాస్తవ్యుడు, బీడియల్ ఉద్యోగి రాణా ప్రతాప్ అనే వ్యక్తి తన కూతురి వివాహం సందర్బంగా ఈ మద్య పుల్వామా లో జరిగిన బాంబ్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను పెళ్లి పత్రికలో ప్రస్తావించారు. దేశం కోసం పోరాడుతున్న నా వీర సైనికుల పవిత్ర పాదాలకు ప్రణమిల్లుతూ అంటూ అందరికి స్వాగతం పలుకుతున్నట్టు పెళ్లి పత్రికలో ముద్రించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ రాణా ప్రతాప్ దేశ భక్తిని చూసి లోలోపల గర్వపడటమే కాకుండా బయటకు శభాష్ అంటున్నారు.