గిరిజన బాలికల మృతి మిస్టరీ: వారిని బైక్పై దించిన వ్యక్తి ఎవరు?
వరంగల్: బానోతు ప్రియాంక, బానోతు భూమిక అనే ఇద్దరు విద్యార్థినుల మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ జిల్లా మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో అత్యంత దారుణమైన స్తితిలో మరణించిన విషయం తెలిసిందే.
చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఎస్బిహెచ్ బ్యాంకుకు చెందిన సిసిటీవీ ఫుటేజీని పరిశీలించగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. భూమిక, ప్రియాంక నిరుడు నవంబర్ 24వ తేదీన చెన్నారావుపేట మండల కేంద్రానికి చేరుకున్నట్లు మంగళవారంనాడు పరిశీలించిన సిసిటీవీ ఫుటేజీ ఆధారాన్ని బట్టి తెలుస్తోంది.
బైక్పై వచ్చిన ఓ వ్యక్తి వారిని మండల కేంద్రంలోని ఎస్బిహెచ్ బ్యాంక్ ఆవరణలో దించి బ్యాంకులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బ్యాంకులోకి వెళ్లిన ఆ వ్యక్తి వెంటనే బయటకు వచ్చి విద్యార్థినులతో 5 నుంచి 10 నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఆ వ్యక్తి గీతలతో కూడిన ఆఫ్ టీ షర్ట్ వేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి బైక్పై వెళ్లిపోయాడు. విద్యార్థినులు ఖాదర్పేట వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సిసిటీవీ ఫుటేజీలను చూస్తే అర్థమైనట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు ఆ వ్యక్తి కోసం ఆర తీస్తున్నారు.
ఆ వ్యక్తి ఎవరు, విద్యార్థినులను బైక్పై ఎందుకు తీసుకుని వెళ్లాడనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆ వ్యక్తిని గుర్తించి, విచారిస్తే విద్యార్థినుల మృతి వెనక గల మిస్టరీ వీడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.