హరీష్ ప్లాన్ బూమ్ రాంగ్ - నాడు దుబ్బాక..నేడు హుజూరాబాద్ : ట్రబుల్ షూటర్ ముందే చెప్పారా..!!
హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఇప్పుడు అనేక చర్చలకు కారణమవుతోంది. ఈ ఎన్నిక ఈటల వర్సెస్ కేసీఆర్ గా మొదలై..చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి హరీష్ అనే స్థాయిలో జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్ది గెల్లు శ్రీను ప్రచారంలో హరీష్ అన్నీ తానై వ్యవహరించారు. టీఆర్ఎస్ లో ఏ సమస్య వచ్చినా పరిష్కరించల నైపుణ్యం..సమర్ధత ఉన్న నేతగా హరీష్ కు గుర్తింపు ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఆదుకుంటూ, తన రాజకీయ చతురతతో టీఆర్ఎస్ విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న హరీశ్రావు వరుసగా రెండో సారి ఎదురు దెబ్బ తిన్నారు.

హరీష్..అంతా తానై
ఈటల రూపంలో తగిలిన షాక్ మాత్రం టీఆర్ఎస్ పైకి ఎన్ని చెప్పినా లోలోపల మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. గతంలో అంతా తానై పార్టీని తన భుజస్కంధాలపై ఉంచుకుని నడిపించిన హరీశ్రావుకు ట్రబుల్ షూటర్ అని పేరుంది. అయితే ఇంతటి రాజకీయ చతురత ఉన్న హరీశ్రావు.. హుజూరాబాద్లో విషయంలో మాత్రం చర్చకు కారణమయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే, వాళ్లకు అక్కడి పరిస్థితులు తెలిసే వెళ్లలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ట్రబుల్ షూటర్ అంచనాలు తప్పాయి
హుజూరాబాద్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. వివిధ ప్రయత్నాలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ఆఖరికి హుజూరాబాద్కు ప్రత్యేకంగా దళితబంధు పథకాన్ని కూడా వర్తింపజేశారు. అయినా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పిన మంత్రి హరీశ్రావు అంచనాలు తలకిందులయ్యాయి. అయితే ఆయన ప్రచారం వల్లే టీఆర్ఎస్కు ఆమాత్రమైనా ఓట్లు పడ్డాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తొలి నుంచి టీఆర్ఎస్ కు కంచుకోటగా
హుజూరాబాద్ నియోజగవర్గంలో 6 దఫాల ఎన్నికలలో వరుసగా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటెల నాలుగు సార్లు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 2004లో జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్కి చెందిన కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు తన ప్రత్యర్థి అయిన.. టీడీపీ అభ్యర్థి పెద్దిరెడ్డిపై 44,669 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల వరుసగా 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.

సానుభూతి ఈటలకు కలిసి వచ్చింది
అయితే టీఆర్ఎస్ నుంచి ఈటల బయటికొచ్చిన తర్వాత నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హుజూరాబాద్ ఫలితాల్లో బీజేపీ కంటే ఈటలకు ఉన్న ఇమేజే.. ఉత్తమ ఫలితాలకు కారణమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. బీజేపీ కంటే ఈటలను చూసే ఓట్లు వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు, వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీఆర్ఎస్కు గత ఏడాది నవంబర్లో దుబ్బాక ఎన్నికల రూపంలో బ్రేకులు పడడం, ఈ ఏడాది మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నికల రూపంలో గట్టి దెబ్బే తగిలింది. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్లో అంతర్మథనం మొదలైంది.

హరీష్ వైఫల్యం అయితూ..పార్టీలో ఇంకెవరు
ఎక్కడ లోపం ఉంది, దేనివల్ల ఇలా జరుగుతోంది అనే అంశాలపై కసరత్తు ప్రారంభమైంది. అయితే, ఏడున్నారేళ్ల ప్రభుత్వ పాలన..పధకాలు...కొత్త నేతల చేరికల కంటే.. ఆరు నెలల కాలంగా ఈటల పైన కేసీఆర్ వ్యవహరించన తీరే ప్రధానంగా హుజూరాబాద్ ఓటర్ల పైన ప్రభావం చూపించినట్లుగా స్పష్టం అవుతోంది. అయితే, టీఆర్ఎస్ లో హరీష్ రావు గెలిపించలేని పరిస్థితులు ఎదురవుతుంటే..ఇక ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ మొదలైంది.
Recommended Video

హరీష్ ముందే గుర్తించారా
అయితే, హరీష్ ముందుగానే ఓటరు నాడి పసి గట్టారని.. వాళ్లల్లో ఉన్న అభిప్రాయాలను గుర్తించి...అభ్యర్ది పేరుతో తానే ప్రచారం చేసి ఈ స్థాయిలో పోటీ ఇవ్వటంలో ముందు నిలిచారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ పూర్తయిన తరువాత హరీష్ ఎక్కడా మెజార్టీ గురించి మాట్లాడలేదు. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో కేటీఆర్.. రూరల్ ఏరియాల్లో ఎన్నికలకు హరీష్ బాధ్యత తీసుకుంటున్నారు. కానీ, తాజాగా జరిగిన గ్రేటర్ లో ..దుబ్బాక...ఇప్పుడు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో..ఇప్పుడు టీఆర్ఎస్ లో అంతర్మధనం మొదలైంది.












Click it and Unblock the Notifications