రైతుల మరణాలకు ఆ రెండు పార్టీలే కారణం.!టీఆర్ఎస్,బిజెపిలు తోడు దొంగలన్న రేవంత్ రెడ్డి.!
ఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికారుల వ్యవహారశైలి కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అనుగుణంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై తక్షణమే చర్యలు తీసకోవాలని ఆయన డిమాండ్ చేసారు. గత మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం వరి ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు రైతాంగం సమస్యలపై పోరాటం చేస్తున్నా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ ఎంపీల చిల్లర నిరసన.. సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావన్న రేవంత్ రెడ్డి
ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని, టీఆర్ఎస్ ఎంపిలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారని, ఎంపీలు సేద తీరే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో టీఆర్ఎస్ ఎంపీలు దీక్ష చేస్తున్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపిల ప్రవర్తన చాలా చిల్లరగా ఉందని, చంద్రశేఖర్ రావు, ఎంపీల ప్రకటనల వల్ల తెలంగాణ రైతాంగ సమస్యలు పరిష్కారం కావని, మిల్లర్ల మాఫియాలో బందీ అయిన రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలును కుదించుకుందని పేర్కొన్నారు. రైతులను మిల్లర్ల మాఫియాకు అప్పగించిందని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.

టీఆర్ఎస్ సిబీఐ విచారణ కు ఎందుకు ఆదేశించడం లేదన్న రేవంత్
ప్రభుత్వ గోడౌన్ ల నుంచి ధాన్యం మాయం..టీఆర్ఎస్ సిబీఐ విచారణ కు ఎందుకు ఆదేశించడం లేదన్న రేవంత్
అంతే కాకుండా 2018, 2019, 2020 లలో తెలంగాణ ప్రభుత్వం తనకు ఎఫ్.సి.ఐ ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయలేదని, ఎఫ్.సి.ఐ సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ ల నుంచి మాయం అయ్యాయని ఆరోపించారు. దీనికి భాధ్యులు ఎవరిదని, సిబీఐ విచారణ కు ఎందుకు ఆదేశించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీసారు. వరంగల్ లో మాయం అయిన 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. మంగళవారం నుండి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చెయ్యరని, చంద్రవేఖర్ రావు ఆదేశాల మేరకు అందరూ హైదరాబాద్ పయనం అవుతారని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి.

రైతులకు కష్టం రానియ్యనన్న కేసీఆర్.. ఇప్పుడేం సమాధానం చెప్తారన్న రేవంత్
బిజెపి,టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను ముగిస్తున్నారని, తెలంగాణ రైతులు తమ తమ ఎంపీలను నిలదీయాలని సూచించారు. తాను బతికి ఉన్నంత కాలం రైతులకు కష్టం రానియ్యనన్న చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రవేఖర్ రావు బతికే ఉన్నాడా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని అన్నారు. ఆదాని, అంబానీలకు రైతాంగ ప్రయోజనాలను చంద్రశేఖర్ రావు, కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతున్నాయని అన్నారు. చంద్రవేఖర్ రావు, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ లు తమ పదవుల్లో కొనసాగే హక్కు లేదని, కేంద్ర ఇచ్చిన టార్గెట్ తగ్గిస్తే దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు.
Recommended Video

జంతర్ మంతర్ వేదికగా నిరసన తెలపాలి.. కేసీఆర్ కు రేవంత్ సవాల్
రానున్న రోజుల్లో తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ వేధికగా ధర్నా చేస్తుందని, టీఆర్ఎస్ ఎంపీలను కోడిగుడ్లు, టమాటలు, చీపుర్లతో కొట్టి సన్మానించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బియ్యం సేకరణలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్, బిజెపి ఎంపిలు రెండు తోడు దొంగలేనని, ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ వేదిక పంచుకోదని, తెలంగాణలో రైతులను హత్యచేసిన పార్టీలని, రైతుల మరణాలకు కారణం ఐన పార్టీలు ఇప్పుడు సంతాపం చెబుతున్నాయని మండిపడ్డారు. చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications