బీజేపీ ఎంపీ అరవింద్ కారుపై టీఆర్ఎస్ నేతల దాడి, ఘర్షణ: తీవ్ర విమర్శలు, టీఆర్ఎస్ కౌంటర్
హన్మకొండ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అరవింద్ బయటకు వెళ్తుండగా కొంత మంది టీఆర్ఎస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు.
బీజేపీ ఎంపీ అరవింద్ కారుపై దాడి..
అక్కడ్నుంచి బయల్దేరిన అరవింద్ కారును అడ్డుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు యత్నించాయి. అరవింద్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలోకి వెళ్లడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడేవున్న బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు
కాగా, ఆదివారం జరిగిన వరంగల్ బీజేపీ శ్రేణుల సమావేశానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంద్ర లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. వినయ్ భాస్కర్, నరేందర్ను అరవింద్.. బిల్లా రంగాలతో పోల్చారు. వీరు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ఒక్కొక్కరిపై చాలా కేసులుంటాయన్నారు. ఈ విమర్శల నేపథ్యంలోనే టీఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించాయి.
దాడి సిగ్గుచేటు..
తన కారుపై దాడి నేపథ్యంలో ఎంపీ అరవింద్ మరోసారి టీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు. వరంగల్లో తాను ‘ఆత్మనిర్భర్ భారత్'పై మీడియా సమావేశానికి హాజరయ్యానని, ఈ సందర్భంగా తనపై దాడికి యత్నించారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియా ఖాతాకు జతచేశారు. ఓ ఎంపీపై ఇలా దాడికి పాల్పడటం సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి సిగ్గుచేటని విమర్శించారు. పట్టపగలు ఓ ప్రజాప్రతినిధిపై అల్లరిమూకలు దాడికి యత్నించడం ఏంటని నిలదీశారు. అరవింద్పై దాడి సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
Recommended Video

అరవింద్వి సిఖండి మాటలు.. దమ్ముంటే నిరూపించాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాగా, అరవింద్ ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు స్పందించారు . వరంగల్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పసుపు బోర్డు హామీ నెరవేర్చని అరవింద్ ఇక్కడికొచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ నాయకులపై విమర్శలు చేసే అర్హత అరవింద్కు లేదన్నారు.
కబడ్దార్ బీజేపీ నాయకుల్లారా... మా జోలికి వస్తే ఊరుకునేది లేదు.. మీరు అభివృద్ధి చేయరు.. మమ్మల్ని చేయనవ్వరు అంటూ వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అరవింద్వి అసత్యపు మాటలని అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంద్ర మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మోసం చేసిన 420 అరవింద్ అని, రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి తప్పుడు ధృవపత్రాలు తెచ్చి ఎంపీఏ పాస్ అయ్యారని ఆరోపించారు. అరవింద్వి సిఖండి మాటలన్న నన్నపునేని.. వరంగల్లో ఒక గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తమ పార్టీ నేత కవిత చిత్తశుద్ధి మీద విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. తాజా ఘర్షణ, రాజకీయ విమర్శలు వరంగల్ జిల్లాలో రాజకీయ వేడిని పెంచాయి.












Click it and Unblock the Notifications