శానంపూడిదే జోరు.. హుజుర్ నగర్లో గులాబీకే పట్టం..!
సూర్యాపేట : మహారాష్ట్ర, హర్యానాలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ క్రమంలో మహా రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళుతోంది. అయితే సీఎం కుర్చీ కావాలని శివసేన పట్టుబడుతుందనే నేపథ్యంలో అక్కడి రాజకీయం హాట్ టాపికైంది. మరోవైపు హర్యానాలో హంగ్ ప్రభుత్వం తప్పేలా లేదు. అదలావుంటే తెలంగాణలోని ఒకే ఒక్క నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గులాబీకే మళ్లీ పట్టం కట్టబోతున్నారు ప్రజలు.
హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో తొలిసారిగా గులాబీ జెండా రెపరెపలాడనుంది. ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐ శానంపూడి సైది రెడ్డి హవా కనిపిస్తోంది. 14వ రౌండ్ ముగిసే సరికి 26 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు సైది రెడ్డి. ఇక 15వ రౌండ్ ముగిసే సరికి అది కాస్తా 29 వేలకు పైగా చేరింది. ప్రస్తుతం 34 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
50 ఏళ్ల హిస్టరీ మహారాష్ట్రలో రిపీట్ కానుందా.. సీఎం కుర్చీ బీజేపీ నుంచి జారిపోనుందా?
ఊహించని విధంగా శానంపూడి జోరు కొనసాగుతుండటంతో దాదాపు ఆయన విజయం ఖాయమైనట్లే. అధికారిక ఫలితాలు రావాలంటే కొంత సమయం పట్టనుంది. ఆయన రౌండ్ల వారీగా ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన ఓట్లు ఒకసారి పరిశీలించినట్లయితే.. మొదటి రౌండ్లో 2,467.. రెండో రౌండ్లో 4,000.. మూడవ రౌండ్లో 6,777.. నాలుగో రౌండ్లో 9,356, ఐదవ రౌండ్లో 11 వేలు.. ఆరవ రౌండ్లో 12, 356.. ఏడవ రౌండ్లో 14,300.. ఎనిమిదవ రౌండ్లో 17,400.. తొమ్మిదవ రౌండ్లో 19,200.. పదవ రౌండ్లో 19,200.. పదకొండవ రౌండ్లో 21,618.. పన్నెండవ రౌండ్లో 23,821.. పదమూడవ రౌండ్లో 25, 366 ఓట్లు సాధిస్తూ వచ్చారు.