బాబు, లోకేష్, రేవంత్ ప్రచారం చేసినా..: సెటిలర్ల ప్రాంతాల్లోనూ టిఆర్ఎస్ హవా
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక కార్పొరేటర్లను సాధించి మేయర్ పీఠాన్ని సొంతంగా కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఎన్నికల ఫలితాలను శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి విడుదల చేశారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం.
సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి, వివేకానందనగర్, ఎల్బీనగర్, పటాన్చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో భారీ ఆధిక్యంతో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాగా, తెలుగుదేశం పార్టీ సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ వెనకబడింది.
ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపి మంత్రులు, తెలుగుదేశం నేత నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేసినా, తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి గర్జించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయినట్లైంది. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ టిఆర్ఎస్ భారీ ఓట్లతో ఆధిక్యం ప్రదర్శించింది.
కాగా, ఇతర ప్రతిపక్ష పార్టీలు టిఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లో లేకుండా పోయాయి. 100కుపైగా కార్పొరేటర్లను టిఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. టిఆర్ఎస్ శ్రేణులో బాణాసంచా పేలుస్తూ నగర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.