ఆశీర్వాద సభలపైనే ఫోకస్..! అరమరికలకు రిపేరు ఉంటుందంటున్నబాస్..!!
హైదరాబాద్: పార్టీలో నెలకొన్న పరస్పర విరుద్ద పరిణామాలను పక్కన పెట్టి ప్రజా ఆశీర్వాద సభలపై ద్రుష్టి కేంద్రీకరించారు గులాబీ బాస్. పార్టీ లో కమ్ముకున్న అసంత్రుప్తి మేఘాలు కూడా త్వరలో విడిపోతాయని చెప్పుకొస్తున్నారు. సభల కోసం జనాన్ని సమకరించేందుకు అన్ని మండల, గ్రామ కమిటీలకు బాధ్యతలను అప్పగించింది అదిష్టానం. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభలకు పెద్దసంఖ్యలో జనాన్ని తరలించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారీగా జనాన్ని తరలించి సభను విజయవంతం చేయడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసరాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. ఇటీవల పార్టీలో నెలకొన్న అసంత్రుప్త అరమరికలకు కూడా రిపేరు చేసే దిశగా అదిష్టానం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రజా ఆశీర్వాదసభతో కేసీఆర్ బిజీ..! విభేదాలు సర్ధుమనుగుతాయంటున్న గులాబీ బాస్..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాదసభల ఏర్పాట్లలో నిజామాబాద్, నల్గొండ, పాలమూరు ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలు తలమునకలుగా ఉన్నారు. ఈ నెల మూడున నిజామాబాద్లో కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాదసభ నిర్వహించనుండగా, నాలుగున నల్గొండ, ఐదున పాలమూరు జిల్లాలో బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఈసభలను పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం ద్వారా, ప్రజల దృష్టిని ఆకర్షించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా అందరి కంటే ముందుగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తమ అభ్యర్థులను జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలోను అదే దూకుడును కొనసాగించాలని నిర్ణయించింది.
సభలు సక్పెస్ ఐతే పార్టీ సక్సెస్ ఐనట్టే..! గెలుపు గులాబీదే అంటున్న శ్రేణులు..!!
అభ్యర్థులను ప్రకటించిన అన్ని నియోకవర్గాలకు ఇప్పటికే ప్రచార సామగ్రిని పార్టీ నాయకత్వం సరఫరా చేసింది. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 10లక్షల విలువైన ప్రచార సామగ్రి అందినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార ఊపును ఉధృతం చేసేందుకు పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ప్రచారపర్వంలో భాగంగా నిజామాబాద్, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు, ఆయా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే, మరోవైపు సభల సక్సెస్పై టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు దృష్టిసారించారు.
కొంగర్ కలాన్ లా చేయొద్దు..! జనాన్ని సమీకరించాలంటోన్న బాస్..!!
నియోజకవర్గానికి కనీసం పాతిక వేల మందిని తరలించేవిధంగా స్థానిక నాయకత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సభలను సక్సెస్ చేయాలని భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటున్న సభల సక్సెస్ బాధ్యతను జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నేతలప్పగించారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్థులు, ఇంచార్జులకు జనసమీకరణ బాధ్యతలను కట్టబెట్టారు. విపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో, ప్రతి గ్రామం నుంచి కేసీఆర్ సభకు జనాన్ని సమీకరించడం ద్వారా అంతటా ఎన్నికల వేడిని పుట్టించవచ్చని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.
నాయకత్వం పల్లెల్లో ఉండాలి..! సభలను విజయవంతం చేయాలని బాస్ ఆదేశాలు..!!
ప్రతిపక్ష అభ్యర్థులు గ్రామాలకు వచ్చే సమయానికే తాము కనీసం ఒకటికి రెండు సార్లు తిరిగి రావచ్చన్న ఆలోచనతో అభ్యర్థులు తమ నియోజకవర్గాల పరిధిలోని పల్లెల బాటపడుతున్నారు. దీనికి గాను మండలాలు, గ్రామాల వారీగా టార్గెట్లు పెట్టేందుకు ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సభలకు ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, పాలమూరు జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 40 వేలకు తగ్గకుండా జనాన్ని కేసీఆర్ సభకు సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు సభను విజయవంతం చేసే పనిలోనే నిమగ్నమయ్యారు.