నిజాంను తలపిస్తున్న కేసీఆర్ పాలన కాంగ్రెస్కు ఓటేస్తే దేశ ద్రోహులకు వేసినట్లేనన్న యోగి
పెద్దపల్లి : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సమరానికి సిద్ధమవుతోంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను రంగంలోకి దింపింది. పెద్దపల్లిలో జరిగిన పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. టీఆర్ఎస్, కాంగ్రెస్ వైఖరులను కడిగిపారేశారు. దేశ సమగ్రతకు ముప్పు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ కోసం ఫ్లాష్ మాబ్ .. టీఆర్ఎస్ కౌంటర్ ఫ్లాష్ మాబ్ .. ఏం క్రియేటివిటీ రా నాయనా
తెలంగాణలో నిజాం పాలన
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను యూపీ సీఎం ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ విధానాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని యోగి విమర్శించారు. రామగుండంలో మూతబడ్డ ఎరువుల కర్మాగారాన్ని రూ. 5,500కోట్లతో పునరుద్ధరించిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ వైఖరిపై యోగి ఫైర్
దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కవుతున్నాయని యోగి ఆరోపించారు. ఎంఐఎం ప్రకటనలు దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్న ఆయన.. వాటికి టీఆర్ఎస్ మద్దతు పలుకుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కావాలంటూ టీఆర్ఎస్, ఎంఐఎంలు దేశ భద్రతకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ఓటేస్తే దేశ ద్రోహులకు వేసినట్లే
కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రవాదులకు బిర్యానీలు తినిపిస్తే.. మోడీ ప్రభుత్వం వారికి బుల్లెట్లతో సమాధానమిచ్చిందని యోగి చెప్పారు. బీజేపీ హయాంలోనే ఉగ్రవాదులపై మెరుపుదాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు దేశ ద్రోహులకు, ఉగ్రవాదులకు వేసే ఓటుగానే పరిగణించాలని అన్నారు. దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారం చేపట్టేలా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.