'నయీంతో కలిసి కోమటిరెడ్డి హత్యకు కుట్ర', తెరాస నేతలు సహా గన్ లైసెన్స్ రద్దు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం విషయంలో తెరాస నేత దుబ్బాక నర్సింహా రెడ్డి ఓ టీవీ ఛానల్తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నయీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కోమటిరెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. నయీంతో తనకు సంబంధం లేదని తన గన్ లైసెన్స్ రద్దుకు నయీం కేసుకు సంబంధం లేదని చెప్పారు. కోనాపురి రాములు హత్యతోను తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
నయీం ఆగడాలు: సోదరిని తిట్టాడని చంపేశాడు, కానుకలుగా బైక్లు, బంగారు చైన్లునిజంగా తన పాత్ర ఉంటే ఎఫ్ఐఆర్లో తన పేరు ఉండేదని చెప్పారు. కోనాపురి రాములు తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. కోమటిరెడ్డి... నయీంతో కలిసి తన హత్యకు కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రాణహాని ఉందనే తాను గన్ లైసెన్స్ తీసుకున్నానని తెలిపారు. నయీంతో కోమటిరెడ్డికి సంబంధాలున్నాయని, గత ఎన్నికల్లో కోమటిరెడ్డికి నయీం సహకరించారని ఆరోపించారు. 2009లో నయీంకు కోమటిరెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారు కొనిచ్చారన్నారు. ఈ మొత్తం పరిణామంలో కోమటిరెడ్డి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.
ఇదిలా ఉండగా, నయీం కేసులో సన్నిహిత నేతలకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఇందులో భాగంగా తెరాసతో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్న లైసెన్సుడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారని, కొందరు నేతలు ఆయుధ లైసెన్సులు కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. నయీంతో సంబంధాలు నెరిపిన పోలీసు అధికారులకు మెమోలు జారీ చేశారని సమాచారం.