వైఎస్ఆర్టీపీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత: చేరికలకు గేట్లెత్తిన షర్మిల: ఆ జిల్లాలో బలం
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించినట్టే. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. 2023 నవంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే- త్రిముఖ పోరు ఖాయం అయ్యేలా ఉంది. అధికార టీఆర్ఎస్కు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోన్నాయి.

గట్టు చేరిక
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల కోసం సన్నద్ధమౌతోంది. పార్టీలో చేరికలపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకుడు గట్టు రామచంద్ర రావు కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్టీపీలో చేరారు. పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సమక్షంలో ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కండువాను కప్పి.. వైఎస్ షర్మిల ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

టీఆర్ఎస్ నుంచి
ఆవిర్భావం తరువాత అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ బలమైన నాయకుడు వైఎస్ఆర్టీపీలో చేరడం ఇదే తొలిసారి. దీనితో అందరి దృష్టీ గట్టు రామచంద్ర రావుపై నిలిచింది. ఆయన దిశా నిర్దేశంలో వైఎస్ఆర్టీపీ వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. అదే సమయంలో- వేర్వేరు పార్టీలకు చెందిన కొందరు పేరున్న నాయకులు వైఎస్ఆర్టీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ దిశగా గట్టు రామచంద్ర రావు దృష్టి సారిస్తారని చెబుతున్నారు.

సీపీఎంతో ఆరంభం..
తెలంగాణ రాజకీయాలపై గట్టు రామచంద్ర రావుకు గట్టిపట్టు ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన గట్టు రాజకీయ ప్రస్థానం సీపీఎంతో ఆరంభమైంది. అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ సక్సెస్ కాలేకపోయారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తరువాత అందులో కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్లో చేరిక..
బీసీ విభాగానికి రాష్ట్ర కన్వీనర్గా పనిచేశారు. ఎక్కువ రోజులు వైఎస్ఆర్సీపీలో కొనసాగలేకపోయారు. టీఆర్ఎస్లో చేరారు. కొంతకాలంగా గట్టు రామచంద్ర రావు.. టీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వస్తోన్నారు. పార్టీలో సరైన గుర్తింపు లభించట్లేదని ఆయన భావించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదంటూ కొద్దిరోజుల కిందటే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ స్పష్టం చేశారు. పార్టీ అగ్రనాయకత్వం తీరుపై బాహటంగానే తన అసంతృప్తిని వెలిబుచ్చారు.

పల్లాదే పెత్తనం..
ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఆయన పెత్తనం అధికమైందని, సీనియర్ నాయకులను కలుపుకొని వెళ్లట్లేదని చెప్పారు. ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను పట్టించుకోవట్లేదని అన్నారు. తనకు పదవులు కాదని.. ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ కోటరి ఉందని, మిగిలిన వారిని ఎవరినీ కేసీఆర్తో కలవనివ్వదని ఆరోపించారు.
Recommended Video

కేసీఆర్పై నో కంప్లైంట్స్..
కేసీఆర్ను కలవడానికి ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తే.. తాను బయటే నిల్చోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని గట్టు రామచంద్ర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన ఆత్మాభిమానాన్ని చాలాసార్లు దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్పై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని గట్టు రామచంద్ర రావు ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతింటే రాజకీయాల్లో మనుగడ సాగించలేమని, పార్టీ
స్థితిగతుల గురించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే వాతావరణం లేదని అన్నారు. మన బాధను మనం చెప్పుకోలేకపోతున్నామి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications