రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు వారికేనా?
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఎవరికనే సందేహం ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి హాజరుకాని కేసీఆర్ విపక్షాలు ఉమ్మడిగా ప్రకటించిన యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వంపట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఎన్డీయే కనుక వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా ప్రకటిస్తే తెలుగు వ్యక్తి కాబట్టి ఆయనకే మద్దతిచ్చామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్డీయే ఇంతవరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు. వెంకయ్యనాయుడితోపాటు చత్తీస్గడ్ గవర్నర్ ఊయీ కూడా రేసులో ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్డీయేకు తగినంత బలం లేకపోవడంతో ఆ పార్టీ అన్నాడీఎంకే, వైసీపీ, బిజూ జనతాదళ్పై ఆధారపడాల్సి వస్తోంది. దక్షిణాదికి ఇవ్వాలనే సెంటిమెంట్ ఇప్పుడిప్పుడే వస్తుండటంతో ఆవైపు బీజేపీ పెద్దలు మొగ్గితే వెంకయ్యనాయుణ్ని అదృష్టం వరించే అవకాశం ఉంది. అప్పుడు ఏపీలోని వైసీపీ, తెలుగుదేశం, తెలంగాణలోని టీఆర్ఎస్, తమిళనాడులోని అన్నాడీఎంకే, కర్ణాటకలోని జేడీఎస్ మద్దతిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎన్డీయే పని సులువవుతుంది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు మధ్యాహ్నం హడావిడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఖరారైతే తెలుగు వ్యక్తిగా టీఆర్ ఎస్ ఆయనకే మద్దతిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.