టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి నేతలు: డీకే అరుణ, ఓటు నమోదు చేసుకున్న గద్దర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన మేనిఫెస్టో పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ బుధవారం నిప్పులు చెరిగారు. తమ పార్టీ మేనిఫెస్టోను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని విమర్శించారు. ఓడిపోతామన్న అభధ్రతా భావనతో కేసీఆర్ మోసపూరిత వాగ్ధానాలు చేశారన్నారు.
కేంద్రం నుంచి ఏం రాలేదు: కేసీఆర్, నిరుద్యోగ భృతి రూ.3వేలు, టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదీ..
రాష్ట్ర పరిస్థితి దిగజారిపోయింది
కేసీఆర్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూసిన కేటీ రామారావు ఈ హామీలు నెరవేర్చడానికి దక్షిణ భారత దేశ రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల అవగాహన లేదన్నారు. ఎన్ని మాయమాటలు చెప్పినా వినడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు.
కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు
టీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ చెప్పారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేని కేసీఆర్, మళ్లీ అధికారంలోకి రాలేరని చెప్పారు. గతంలో రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీలేని రుణాలు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే అన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు.
నిరంకుశ పాలన
త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో మార్పు రాలేదని, రాష్ట్రంలోని పెత్తనందారీ వ్యవస్థను అంతం చేసేందుకు ప్రజాపోరాటం ప్రారంభం చేశానని ప్రజాగాయకుడు గద్దర్ వేరుగా అన్నారు. రాష్ట్రంలో నయా ఫ్యూడలిజం అమలవుతోందన్నారు. నిజమైన రాజకీయ నాయకులకు ప్రజలే ముఖ్యమని చెప్పారు. నిరంకుశ పాలనను అంతమొందించి అమరుల స్వప్నం నిజం చేసేందుకే తన పోరాటమని చెప్పారు.
ఓటు నమోదు చేసుకున్న గద్దర్
ఏడు దశాబ్దాల తర్వాత తాను ఓటు నమోదు చేసుకున్నానని గద్దర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల విప్లవం తేవాలన్నారు. నవ తెలంగాణ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఓటు అనేది కార్పొరేట్ చేతుల్లో బందీగా మారిందని, తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ప్రజలు కోరుకుంటే ఎవరూ నిలబడకుంటే గజ్వేల్ నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు.