నీళ్ల సంబురం.. రంగనాయక సాగర్ కాలువలో ఈత కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే,ఎంపీ..
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఇటీవలే మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఉన్న ఈ ప్రాజెక్టులో శనివారం(మే 2) మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ప్రధాన కుడి,ఎడమ కాలువల ద్వారా మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.
తరాలుగా ఈ క్షణం కోసమే..
రంగనాయక సాగర్ కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం పట్ల హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్షణం కోసమే ఇక్కడి రైతులు తరతరాలుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. కాలువల వెంట గోదావరి నీళ్లను చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని.. వారి కళ్ల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయని తెలిపారు. ఇంతకాలం పంటలు పండాలంటే రైతులు కాలం మీద,కరెంట్ మీద ఆధారపడ్డారని.. కానీ ఇకనుంచి వాటితో నిమిత్తం లేకుండానే రెండు పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు.
శాశ్వతంగా కరువును ప్రారదోలవచ్చు..
ఏడాది పొడవునా రంగనాయక సాగర్లో నీళ్లు అందుబాటులో ఉంటాయని... దీని ద్వారా శాశ్వతంగా కరువును ప్రారదోలవచ్చునని చెప్పారు. కుడి కాలువ కింద 40 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగవుతాయని చెప్పారు. ప్రాజెక్ట్ కింద ఉన్న చెరువులు,చెక్ డ్యామ్స్,కుంటలను నీటితో నింపుతామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈత కొట్టిన ఎమ్మెల్యే,ఎంపీ..
కాలువల్లోకి నీటిని విడుదల చేసిన సందర్భంలో టీఆర్ఎస్ నేతల్లో ఆనందం వెల్లివెరిసింది. ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు కాలువలో దూకి ఈతకొట్టారు. కాలువలోకి నీటిని విడుదల చేస్తున్న సందర్భంలో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు కొంతమంది స్థానికులు కూడా తరలివచ్చారు.
కాలువ తవ్వకాలకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలని..
సిద్ధిపేట వాగు కింద 28 చెక్ డ్యామ్స్, శనిగరం చెరువును కూడా పెద్ద మొత్తంలో నింపుతామని హరీష్ రావు తెలిపారు. నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్ డ్యామ్స్ను కూడా నింపుతామన్నారు.మైనర్, సబ్ మైనర్ కాలువల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని.. వర్షాకాలం వరకు పిల్ల కాలువలు పూర్తి చేసుకోవాలని అన్నారు. కాలువలు తవ్వడానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగారు. నీళ్ల సంబురాన్ని వాళ్లతో పంచుకున్నారు.