ఎంపీ అరవింద్ కాదు... ఎఫ్ 3 అరవింద్... దమ్ముంటే నాపై పోటీ చెయ్... ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సవాల్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.ఆయన ఎంపీ అరవింద్ కాదని ఎఫ్ 3 అరవింద్ అని ఎద్దేవా చేశారు.ఎఫ్ 3 అంటే ఫేక్,ఫాల్స్,ఫ్రాడ్ అని పేర్కొన్నారు. అరవింద్కు దమ్ము ధైర్యం ఉంటే తనపై ఆర్మూర్లో పోటీకి దిగాలని సవాల్ విసిరారు.స్ట్రీట్ ఫైట్ వద్దని... స్ట్రెయిట్ ఫైట్కు రావాలని పేర్కొన్నారు.
'దసరా శుభాకాంక్షలు.. మిస్టర్ నిజామాబాద్ ఎంపీ... ఫాల్స్ ఫేక్ ఫ్రాడ్ ధర్మపురి అరవింద్... నువ్వు కేడీ నంబర్ 1.. నిన్న గాక మొన్న నందిపేట్లో నేను దుబాయ్ వెళ్లలేడని,రాలేడు,పోలేడని మాట్లాడినవ్. నేనిప్పుడు దుబాయిలో ఉన్నా.గత ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ఈ ప్రాంత రైతులకు ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చారు.తీసుకురాని యెడల రాజీనామా చేసి రైతులతో కలిసి పసుపు ఉద్యమంలో పాల్గొంటానన్నావు.ఈరోజుకు 900 రోజులైంది. 2019,మార్చిలో బాండ్ పేపర్ రాసిచ్చావు. అది ఫేక్ బాండ్ పేపర్ అయింది... నువ్వు ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చినట్లయింది... నువ్వు ఫాదర్ ఆఫ్ ది లయర్ కాబట్టి... ఫేక్ ఎంపీ అంటున్నాం... దుబాయి పోలేడు,పోతే అరెస్టవుతాడని నా గురించి చెప్పావు.ఇప్పుడైనా ప్రజల కోసం మాట్లాడు.నువ్వు చదివింది అబద్దపు చదువు. నీ సర్టిఫికెట్లు ఫ్రాడ్ అని నువ్వు చదివిన అని చెప్పుకుంటున్న యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. వచ్చే దసరా వరకైనా నువ్వు మారు.సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితలపై తప్పుడు ప్రచారాలు మానుకో.నువ్వు అబద్దాలకు తండ్రి లాంటోడివని రాష్ట్రమంతా తెలిసిపోయింది.జై తెలంగాణ.. జై కేసీఆర్...' అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో దసరాను మించిన పండుగ లేదు : మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో దసరాను మించిన పండుగ లేదన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రజలకు మంత్రి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అందరికీ శుభం జరగాలని కోరుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని సిద్దిపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంత్రి హరీశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దసరా పండుగలో మన సాంప్రదాయం,సంస్కృతి,ఆత్మీయత ఉందని హరీశ్ పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా వేగంగా తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు.ప్రజా సంక్షేమం,అభివృద్ది రెండు కళ్లుగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.
రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజల అనంతరం స్థానిక ఇమాంబాద్లో దుర్గామాత శోభయాత్రలో హరీశ్ రావు పాల్గొన్నారు.ప్రతీ ఏటా విజయ దశమి రోజునే ఇక్కడ అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.