తలారి సత్యం మృతి, ఎమ్మెల్యేపై రేవంత్ ఆరోపణలు: మండిపడ్డ జీవన్
నిజామాబాద్: ఆర్మూర్లో తలారి సత్యం మృతి కేసుకు రాజకీయ రంగు రాసుకుంటోంది. తలారి సత్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి సిపిఐఎంల్ న్యూడెమోక్రసీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అయితే, తలారి సత్యం మృతి వెనుక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. తలారి సత్యం హత్య వెనుక జీవన్ రెడ్డి ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జీవన్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు జీవన్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన తలారి సత్యం మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఈ రోజు అన్నారు.
రేవంత్ రెడ్డి తన పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తలారి సత్యం ప్రమాదానికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
రేవంత్ వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాలకు పితామహుడిగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో డిపాజిట్ కూడా దక్కని పార్టీ టిడిపి అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు రవ్వంత రెడ్డిలా చూస్తున్నారన్నారు. తన పైన అసత్య ఆరోపణలు చేయవద్దన్నారు.
కాగా, తలారి సత్యం 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. ఆర్మూర్ నుంచి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన జీవన్ రెడ్డి గెలిచారు. అయితే, ఓ చెక్ బౌన్సు కేసులో జీవన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని తలారి సత్యం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆ తర్వాత తలారి సత్యం పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. జీవన్ రెడ్డి.. తలారి సత్యం పైన ఒత్తిడి చేసి పిటిషన్ను వెనక్కి తీసుకునేలా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.