కెసిఆర్కు తలనొప్పి: లుకలుకలు, ఆందోళనలో ఎమ్మెల్యేలు
సార్వత్రిక ఎన్నికల సమరానికి మరో 18 నెలల సమయం ఉంది. వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్ సమర్పణతోనే అనధికారికంగా రాష్ట్రంలో ఎన్నికల సమరానికి ప్రచార వేడి మొదలవుతుంది.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమరానికి మరో 18 నెలల సమయం ఉంది. వచ్చే ఏడాది వార్షిక బడ్జెట్ సమర్పణతోనే అనధికారికంగా రాష్ట్రంలో ఎన్నికల సమరానికి ప్రచార వేడి మొదలవుతుంది. తెలుగునేలపై ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి సారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలివి..
రాష్ట్ర సాధకుడిగా.. నాటి అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత తొలి సర్కార్కు సారథ్యం వహించే అవకాశం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లభించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం అన్ని సక్రమంగా జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉన్నది. కానీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్కు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఇష్టం లేకున్నది.
ఇందులో రాజకీయ ప్రయోజనాలపై ద్రుష్టి సారించారు కమలనాథులు. దీంతో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశాలు లేకపోవడంతో అందుబాటులో ఉన్న స్థానాలనే ఉన్న వారందరికీ తప్పనిసరిగా సీట్లు భర్తీ చేయాల్సిన పరిస్థితి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ది. తెలంగాణలో కొలువు దీరిన తర్వాత ఫిరాయింపులతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య దాదాపుగా 90కి చేరుకున్నది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా నచ్చజెప్పాల్సిన బాధ్యత గులాబీ బాస్దే మరి.
అందరికీ టిక్కెట్లు ఇస్తామని ఇలా భరోసా
సాధారణ పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా వింటారు. కానీ టిక్కెట్ కేటాయింపు అనేది రాజకీయ పార్టీ నాయకుడికి చాలా కీలకం. సాకులు చెప్పి టిక్కెట్లు నిరాకరిస్తే కుదరని పని. అందుకే ఇటీవలి కాలంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి.. వాటిల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా సదరు ఎమ్మెల్యేలకు ర్యాంకులిస్తున్నారు సీఎం కేసీఆర్. రేపు ఆ ర్యాంకులు, తన అభిమతానికి అనుగుణంగా ‘గెలుపు గుర్రాల'కే టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఆయనది. అప్పటివరకు ఎమ్మెల్యేలను బుజ్జగించాల్సిన పని కూడా సీఎందే.
అందుకే ‘2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేందరికి టికెట్లు ఇస్తా. మళ్లీ గెలిపించే బాధ్యత నాదే. నేను చెప్పిన పనులైతే చేయాలి మరి. డిసెంబర్ వరకు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాన్ని వీడొద్దు. కానీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాల పరిధిలో పార్టీ కొంత బలహీనంగా ఉన్నది' అని ఇటీవల హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు ఇతర పార్టీలోని నేతల వలసలపై కన్నేశాయి మరి.
సీఎం హెచ్చరికలతో అప్రమత్తం
దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేల్లో గుబులు బయలుదేరింది. రిజర్వుడ్ స్థానాల్లో బలహీనంగా ఉన్నామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడం వారిని వణికిస్తున్నది. అసలు బలహీనంగా ఉన్న నేతలు ఎవ్వరన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ రెండు దఫాలు సర్వేలు నిర్వహించారు. కానీ ఆ సర్వేల్లో ఏ ఒక్కరికీ అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదు. బహిరంగంగా తమకు బేష్షుగ్గా ప్రజాదరణ ఉన్నదని గంభీర వ్యాఖ్యలు చేస్తున్నా.. లోలోపల ఆందోళనకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ హెచ్చరికలతో నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
టిక్కెట్లపైనే రమేశ్ రాథోడ్, రవీందర్ రావు నజర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విభజించిన తర్వాత 18 మండలాల పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నార్నూర్, ఖానాపూర్లో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ స్థానాల పరిధిలో మండలాలు పూర్తిగా ఉన్నాయి.
బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ రిజర్వుడ్ స్థానాలే. ఆదిలాబాద్ నియోజకవర్గం మాత్రమే జనరల్ స్థానంగా కొనసాగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచనా విధానానికి అనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ రమేశ్ రాథోడ్తోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రవీందర్ రావు వంటి వారు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు.
రమేశ్ రాథోడ్ చేరికతోనే రేఖా నాయక్ భవితవ్యంపై నీలినీడలు
ఖానాపూర్, బోధ్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల పరిధిలో గ్రూపు తగాదాలు నేతల మధ్య అంతరాలు తగ్గించలేని స్థాయికి చేరుకున్నాయి. నెల రోజుల క్రితం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ బహిరంగంగానే ఒకరిపై మరొకరు పరస్పరం దూషణకు దిగారు. ఇటీవల రమేశ్ రాథోడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరడంతోనే ఖానాపూర్ టిక్కెట్ ఎవరిదన్న చర్చ మొదలైంది.
వ్యతిరేకతకు దూరంగా జోగు రామన్న
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆదిలాబాద్ ఎంపి గొడం నగేశ్, స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మధ్య ప్రచ్చన్న యుద్దం సాగుతున్నదని పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. దీనికి తోడు 2019లో తానే జిల్లా మంత్రినని ఒక నేత చెప్పుకుంటున్నారని ఆయన దగ్గరి అనుచరులు అభిప్రాయ పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఎలాగైనా తమ నాయకుడికే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారని ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్నారు. ఇక జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం పరిధిలో మంత్రి జోగు రామన్నకు సొంత పార్టీలో వ్యతిరేకత లేదు. పార్టీ పట్ల గల ప్రజాభిమానానికి అనుగుణంగా మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్నారు.