ఎమ్మెల్యేలకు ఎర కేసు: బీజేపీ విజ్ఞప్తిని నిరాకరించిన హైకోర్టు, బీఎల్ సంతోష్ అరెస్ట్ వద్దు!
హైదరాబాద్: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నేరుగా నోటీసులు ఇచ్చేందుకు అక్కడి పోలీసులు అనుమతించడం లేదని సిట్ పిటిషన్ వేసింది. విచారణకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని తెలిపింది.
ఈ కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించొద్దని ఢిల్లీ సీపీని ఆదేశించాలని హైకోర్టును సిట్ కోరింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
ఇది ఇలావుండగా, ఈ కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ నేత హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీఎల్ సంతోష్, శ్రీనివాస్లకు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైనా హైకోర్టు శనివారం విచారించింది.
సిట్ నోటీసులు రద్దు చేయాలన్న బీజేపీ విజ్ఞప్తిని నిరాకరించింది. అయితే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సంతోష్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్ తోపాటు కరీంనగర్కు చెందిన శ్రీనివాస్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 21న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.