టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు: నందు డైరీలో 50 మంది ఎమ్మెల్యేల పేర్లు, రిమాండ్ రిపోర్ట్
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పొందుపర్చారు. ప్రభుత్వాన్ని అస్తిరపర్చేందుకే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పేర్కొన్నారు. అంతేగాక, ప్రత్యేక ఆపరేషన్లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు వెల్లడించారు.

రోహిత్ రెడ్డికి రూ. 100 కోట్ల ఆఫర్..
ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనకు రూ. 100 కోట్లు ఇస్తాం.. ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ను అస్థిరపర్చాలని ఆఫర్ ఇచ్చారు. ఇది అనైతిక చర్య కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

రోహిత్ ఫాంహౌస్లో కెమెరాలు, వాయిస్ రికార్డర్లు
పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌజ్లో మీటింగ్ జరిగే హాల్లో నాలుగు రహస్య కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రోహిత్ రెడ్డి కుర్తా జేబులో రెండు వాయిస్ రికార్డర్లను పెట్టామని పోలీసులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే హాల్లో ఉన్న రహస్య కెమెరాలను మధ్యాహ్నం 3.05 గంటలకు ఆన్ చేశామని, 3.10 గంటలకు నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి ఫాంహౌస్కు వచ్చారరని చెప్పారు.
రోహిత్ ‘కొబ్బరి నీళ్ల' సిగ్నల్తో పోలీసుల ఎంట్రీ
ఆ తర్వాత సాయంత్రం సాయంత్రం 4.10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్, రేగా కాంతారావు వచ్చారు. సుమారు మూడున్నర గంటలపాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు. ముందుగానే రోహిత్ రెడ్డికి ఒక సిగ్నల్ ఇవ్వాలని చెప్పాం. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని పనిమనిషికి చెప్పాలి. అప్పుడే తాము లోపలికి వస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇక కొబ్బరి నీళ్లు తీసుకురావాలని రోహిత్ చెప్పగానే లోపలికి వెళ్లినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నందు డైరీలో 50 మంది ఎమ్మెల్యేల పేర్లు
అయితే, ముగ్గురు నిందితులు కూడా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ఆ తర్వాత వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. రహస్య కెమెరాలు, వాయిస్ రికార్డర్లు సీజ్ చేశాం. వాయిస్ రికార్డర్లను ఆన్ చేసి విన్నాం. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్లు ఇస్తామని వాయిస్ రికార్డర్లలో స్పష్టంగా నమోదైంది. కర్ణాటక, ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా చేశామని రామచంద్రభారతి చెప్పిన విషయం కూడా రికార్డయింది. తుషార్ కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు కూడా ఉంది. తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారు. ఎంఎంఎస్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. రామచంద్రభారతి, నందు వాట్సాప్ సంభాషణల స్క్రీట్స్ మొత్తం ఉన్నాయి. మొత్తం 25 మంది నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంతోష్ బీజేపీ పేరుతో ఉన్న నెంబర్కు రామచంద్రభారతి వాట్సాప్ మెసేజ్ పంపారు. కారులో ఉన్న నందు డైరీ కూడా సీజ్ చేశాం. అందులో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. మిగితా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు మాత్రమే ఫాంహౌస్ కు వచ్చారు అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.