టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు: ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇప్పటికే రెండురోజుల కస్టడీకి అనుమతించామని, మరోసారి కస్టడీకి ఇవ్వడం కుదరదని సిట్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి మరింత సమాచారం తెలుసుకునేందుకు సిట్ అధికారులకు ఇంతకుముందే రెండు రోజులు అనుమతిచ్చింది.
నవంబర్ 10, 11, తేదీల్లో ముగ్గురి నిందితులను కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు పలు విషయాలపై ప్రశ్నించి, కొంత సమాచారం సేకరించారు. అయితే, ఈ సమాచారం సరిపోదని, దర్యాప్తులో భాగంగా కొన్ని ముఖ్య విషయాలు వెల్లడయ్యాయని వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరారు.
అయితే, ఇప్పటికే నిందితులను రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారని నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు పూర్తి తప్పని.. కేవలం రాజకీయ కారణాలతోనే నిందితులపై కేసులు నమోదు చేశారని చెప్పారు. వీరిని అనవసరంగా 25 రోజులకుపైగా చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారన్నారు. వీరిని కస్టడీకి మరోసారి అనుమతించొద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. నిందితులను మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది.
విచారణకు హాజరుకావాలంటూ లాయర్ ప్రసాద్కు హైకోర్టు ఆదేశాలు
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ విచారణకు హాజరుకావాలని న్యాయవాది ప్రతాప్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రతాప్ను అరెస్ట్ చేయవద్దని సిట్ అధికారులను ఆదేశించింది. నిందితుడు, అనుమానితుడు కానప్పటికీ 41ఏ నోటీసు ఇచ్చారని పిటిషనర్ తెలిపారు. కారణాలు ఉన్నందునే న్యాయవాది ప్రతాప్ కు నోటీసు ఇచ్చినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. నోటీసుల ప్రకారం శుక్రవారం విచారణకు హాజరుకావాలని ప్రతాప్ ను హైకోర్టు ఆదేశించింది.