బిగుసుకుంటోన్న ఈడీ ఉచ్చు - విచారణకు ఎమ్మెల్సీ ఎల్ రమణ: అస్వస్థతతో ఆసుపత్రికి..!!
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో ఆపరేటర్ చీకోటి ప్రవీణ్ ఉదంతం కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం అయింది. ఇప్పటికే పలువురికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనీ ఆదేశించారు. తీగ లాగితే డొంక కదులినట్టుగా కనిపిస్తోంది చీకోటి ప్రవీణ్ వ్యవహారం మొత్తం. ఈడీ అధికారుల నుంచి నోటీసులను అందుకున్న వారిలో రాజకీయ నాయకులు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
మోదీ కల సాకారం - అంతరిక్షంపై ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం: ఇస్రో నుంచే మొదలు
ఒకవంక ఎమ్మెల్యేల కొనుగోలు..
ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు సాగుతోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు కేరళకూ వెళ్లొచ్చాయి. అయిదు రోజుల పాటు సిట్ అధికారులు కేరళలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటోన్న రామచంద్ర భారతి సన్నిహితుడిగా భావిస్తోన్న డాక్టర్ జగ్గూస్వామి కోసం గాలించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా..
అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ కూడా హైదరాబాద్ కేంద్రబిందువుగానే సాగుతోంది. ఈ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇదివరకే పొడిగించింది. ఈ నెల 10వ తేదీన వారిద్దరినీ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ ఆదేశించింది.
చీకోటి ప్రవీణ్ కేసులో..
ఈ పరిణామాల మధ్య ఇక తాజాగా చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై దర్యాప్తును ఈడీ అధికారులు మరింత ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు పలువురు నాయకులు ఉన్నట్లు సమాచారం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీప బంధువులను కూడా ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వంటి అంశాలపై ఆరా తీశారు. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీలాండరింగ్పై ఈడీ అధికారులు ఆరా తీస్తోన్నారు.
ఈడీ ఎదుట ఎల్ రమణ..
ఇవ్వాళ తాజాగా టీఆర్ఎస్కు చెందిన శాసన మండలి సభ్యుడు ఎల్ రమణ.. ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఈ ఉదయం ఆయన ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన అధికారులకు అందజేశారు. ఆర్థిక కార్యకలాపాలపై విచారించారు. నేపాల్లో చీకోటి ప్రవీణ్ జూన్లో నిర్వహించిన బిగ్ డాడీ ఈవెంట్ గురించి ఎల్ రమణను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇందులో పాల్గొనడానికి నేపాల్ వెళ్లారా? అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.
అస్వస్థత..
విచారణ కొనసాగుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీనితో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు అధికారులు. బిగ్ డాడీ ఈవెంట్లో పాల్గొనడానికి నేపాల్కు రావాలంటూ చీకోటి ప్రవీణ్ ఆహ్వానించాడని, తాను వెళ్లలేదని వివరించినట్లు చెబుతున్నారు. ఈ క్యాసినో కేసులో డజను మందికి పైగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నేతలు ఉన్నారని అంటున్నారు.