భారత్ బంద్- తెలుగు రాష్ట్రాల్లో మోడీకి ఊరట!: బంద్కు కెసీఆర్ నో, కానీ
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారత్ బంద్ ప్రభావం పెద్దగా కనిపించక పోవచ్చునని భావిస్తున్నారు.
హైదరాబాద్/విజయవాడ: రూ.500, రూ.1000 నోట్ల రద్దును నిరసిస్తూ విపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. నోట్ల రద్దును చాలామంది స్వాగతిస్తున్నారు. అదే సమయంలో ఇబ్బందులను మాత్రం విపక్షాలు, ఎన్డీయేలోని మిత్రపక్షాలు కూడా కొన్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ భారత్ బంద్కు విపక్షాలకు అందరి నుంచి సహకారం లభించడం లేదు.
లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. తమిళనాడు ట్రేడర్స్ అసోసియేషన్ ఈ బంద్కు మద్దతు పలికింది. కర్నాటక, వామపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. కర్నాటక, కేరళ, త్రిపుర తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించనుంది. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ కూడా బందుకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించక పోవచ్చునని అంటున్నారు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉంది. నోట్ల రద్దును తెరాస స్వాగతిస్తోంది. అయితే, నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం పైన ప్రభావం పడిందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాత్రం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
నోట్ల రద్దు ప్రభావం కొంత ఉన్నప్పటికీ, అది మంచిదేనని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో బందుకు తెరాస దూరంగా ఉంటుంది. మరోవైపు, ప్రధాని మోడీ తన హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్తో నోట్ల రద్దు, తదనంతర ప్రభావం, ప్రజల ఇబ్బందులు తదితరాలపై మాట్లాడారు. మరిన్ని చిన్న నోట్లు కావాలని కేసీఆర్ కోరారు. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో తెరాస బందుకు దూరంగా ఉంటోంది.
అంతేకాకుండా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటులో నోట్ల రద్దుపై చర్చించాలని తెరాస కోరుకుంటోంది. నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా సభలో ఆందోళన చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలను గతంలోనే ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
ఏపీలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బందుకు మద్దతిస్తోంది. అధికారంలో బీజేపీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. ప్రజల ఇబ్బందుల పైన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. బందుకు దూరంగా ఉంటారు. మోడీకి దగ్గరగా ఉన్న పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో బంద్ ప్రభావం కనిపించకపోవచ్చు.