10 మందితో టీఆర్ఎస్ మరో జాబితా.. ఇంకా రెండు పెండింగ్.. ప్రకటించిన 117 లో ఎవరి వాటా ఎంత
Recommended Video

హైదరాబాద్ : టీఆర్ఎస్ టికెట్ల ఖరారు దాదాపు పూర్తయింది. అసెంబ్లీ రద్దు తర్వాత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తర్వాత మలక్ పేట, జహీరాబాద్ అభ్యర్థులను డిక్లేర్ చేశారు. తాజాగా బుధవారం రాత్రి మరో 10 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 117 స్థానాలను ప్రకటించినట్లైంది. మరో రెండు స్థానాలను పెండింగ్ లో ఉంచారు కేసీఆర్.
ఒకటి, రెండు రోజుల్లో అవి కూడా తేల్చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింలకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించారు.

తాజా జాబితాలో ఎవరెవరికి టికెట్లు..!
ఖైరతాబాద్ - దానం నాగేందర్
అంబర్పేట - కాలేరు వెంకటేశ్,
మల్కాజ్గిరి - మైనంపల్లి హనుమంతరావు,
గోషామహల్ - ప్రేమ్సింగ్రాథోడ్,
చార్మినార్ - మహ్మద్ సలావుద్దీన్ లోడీ,
మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి,
వరంగల్ తూర్పు - నన్నపునేని నరేందర్,
హుజూర్నగర్ - శానంపూడి సైదిరెడ్డి,
వికారాబాద్ - డాక్టర్ మెతుకు ఆనంద్,
చొప్పదండి - శొంకె రవిశంకర్

ఆచితూచి టికెట్లు.. చార్మినార్ స్థానంపై అనూహ్య నిర్ణయం
మేడ్చల్ స్థానం కోసం సుధీర్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉండటంతో అధిష్టానం రంగంలోకి దిగింది. చివరకు సుధీర్ రెడ్డిని బుజ్జగించి మల్లారెడ్డికి టికెట్ కేటాయించింది. అటు మల్లారెడ్డి కూడా సుధీర్ రెడ్డితో మైత్రి సంబంధాలు నెరుపుతున్నారు. తాజాగా సుధీర్ రెడ్డి ఇంట్లోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మల్కాజిగిరి స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న కూడా చివరకు టీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లి వైపే మొగ్గు చూపి టికెట్ ఖరారుచేసింది. అయితే చార్మినార్ లో అనూహ్యంగా ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించడం చర్చానీయాంశమైంది. రాజేంద్ర నగర్ లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో.. దానికి ప్రతివ్యూహంగానే టీఆర్ఎస్ చార్మినార్ లో ముస్లిం అభ్యర్థిని డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది.

117 ఖరారు.. రెండు స్థానాలు ఎందుకు పెండింగ్?
అసెంబ్లీ రద్దు ప్రకటించిన సెప్టెంబర్ ఆరు నాడే గంపగుత్తగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు గులాబీ బాస్. అనంతరం అక్టోబర్ 21న మలక్ పేట, జహీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా మరో పదిమంది పేర్లు కూడా ప్రకటించడంతో ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను డిసైడ్ చేయాల్సి ఉంది. కోదాడకు వేనపల్లి చందర్ రావు, ముషీరాబాద్ కు ముఠా గోపాల్ పేర్లు ప్రకటించే ఛాన్సుంది. అయితే ముషీరాబాద్ స్థానం విషయంలో నాయిని నర్సింహారెడ్డిని ఒప్పించి ముఠా గోపాల్ కు లైన్ క్లియర్ చేసేందుకు ఆలస్యం జరుగుతోందని సమాచారం.

పొలిటికల్ కోటా.. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు
ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రకటించిన 117 మందిలో సామాజిక వర్గం వారిగా వివరాలు చూసినట్లయితే..
రెడ్డి - 37, వెలమ- 12, కమ్మ- 6, బ్రాహ్మణ- 1, వైశ్య- 1, ఠాకూర్ -1, మున్నూరుకాపు- 8, గౌడ- 6, యాదవ- 5, ముదిరాజ్- 1, పద్మశాలి- 1, విశ్వబ్రాహ్మణ -1, పెరిక- 1, వంజర- 1, మాదిగ- 11, మాల- 7, నేతకాని- 1, లంబాడ-7, కోయ-4, గోండు-1, ముస్లిం-3, సిక్కు-1












Click it and Unblock the Notifications