ఏపీ పాలిటిక్స్పై యూటర్న్: మా పాత్ర ఉండదు.. కేటీఆర్, ఏపీలో జనసేన ప్రభావంపై ఏమన్నారంటే
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే పేరు మార్చి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీలో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. శనివారం నల్గొండ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
నల్గొండలోనే ఆ పార్టీ దెబ్బతిన్నది
రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మొనగాడు కేసీఆర్ అని, 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీని శాసించలేమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నల్గొండను కంచుకోటగా భావిస్తుందని, అలాంటిది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దెబ్బతిన్నదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసినట్లుగానే కార్యకర్తలు అహర్నిషలు పనిచేసి ఇక్కడ తెరాస అభ్యర్థిని గెలిపించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీలా ఉంటుందని చెబుతున్నారని, వారు తప్పితే దేశ ప్రజలకు నేతలు లేరా అన్నారు. మోడీ చేసింది లేదని, రాహుల్పై ప్రజలకు నమ్మకం లేదన్నారు.
మనం గెలిస్తే హైదరాబాదుకు బుల్లెట్ రైలు రాదా?
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డిలు మాట్లాడుతూ.. తెరాస 16 సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని, కాబట్టి తమ పార్టీలను గెలిపించాలని చెబుతున్నారని, కానీ ఏం చేస్తామో గెలిచాక చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. కేంద్రంలో ఎవరో రైల్వే శాఖ మంత్రిగా ఉంటే వారి ఊళ్లకు రైలు మార్గం వెళ్లిందని, మనం ఎక్కువ స్థానాల్లో గెలిస్తే హైదరాబాదుకు బుల్లెట్ రైలు రాదా అన్నారు. నల్గొండ జిల్లాలో మూడు లక్షల పై చిలుకు మెజార్టీతో తెరాస లోకసభ అభ్యర్థి గెలవాలన్నారు.
ఏపీ రాజకీయాల్లో వేలు మా పాత్ర లేదు
కాగా, ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పారు. ఆ తర్వాత తెరాస నేతలు ఏపీలో పర్యటించడం, కేటీఆర్ వంటి నేతలు పదేపదే ప్రస్తావన తీసుకురావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. ఏపీ రాజకీయాల్లో తమ పాత్ర లేదని, తెరాసకు ఒక పార్టీగా ఏపీలో వేలు పెట్టవలసిన అవసరం లేదని, తమకు ఆసక్తి లేదన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోటీ ఉందన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని, జనసేన ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ అందరు చెబుతున్నట్లుగా కేటీఆర్ కూడా త్రిముఖ పోటీ అని చెప్పారు. ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబును సాగనంపుతారని, తాము ఏపీ, తెలంగాణ ప్రజలను ఎక్కడా వేరుగా చూడలేదన్నారు. వారి ప్రయోజనాలకు ఆటంకం కలిగించలేదని చెప్పారు. చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇక్కడకు వచ్చి సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాలని చూశారన్నారు. కాగా, ఇటీవల పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ ఏపీకి వచ్చి మళ్ళీ చిచ్చు రాజేయవద్దని సూచించిన విషయం తెలిసిందే.