weather: రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మండుతున్న ఎండలు, ఉక్కపోత నుంచి మరోసారి ఉపశమనం కలిగనుంది. ఎందుకంటే, రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, సోమవారం పశ్చిమ మధ్య, నైరుతి బంగళాఖాతంలోని తీవ్ర తుఫాను అసని.. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మంగళవారం ఉదయం కాకినాడకు ఆగ్నేయ దిశగా 260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ తీవ్ర తుఫాను వాయువ్య దిశగా పయనించి మంగళవారం రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తరాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అది క్రమంగా బలహీనపడి తదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అసని తీవ్ర తుపాను కారణంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు కూడా రద్దైయిన విషయం తెలిసిందే. అసని తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రాలు భారీ వర్షాలు కురియడంతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది ఇలావుండగా, తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం 9 గంటలకు ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. మధ్య మధ్యలో వర్షాలు కురుస్తున్నా.. ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. సాయంత్రం 6 గంటలు దాటితే కానీ ఎండలు తగ్గడం లేదు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదు అవుతున్నాయి.