తెలంగాణలో భారీ వర్షాలు: హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్, పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంగా హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారమే సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేశారు.

తెలంగాణలో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణతో పాటు మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్భందంలో చిక్కుకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరదలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు
భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లు నీట మునిగిపోయాయి. రహదారులు, వంతెనలపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వీటిపై వెళుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరదలో కొట్టుకపోయి..నలుగురు చనిపోగా మరికొందరు గల్లంతయ్యారు. రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట వద్ద వరదనీటిలో చిక్కుకున్న టీఎస్ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. సోమవారం వదర ప్రవాహంతో గంభీరావుపేట శివారు మానేరు వాగు లోలెవల్ బ్రిడ్జి వద్ద బస్సు చిక్కుకుంది. బస్సులోని ప్రయాణికులను స్థానికులు రక్షించారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో బయటకు తెచ్చేందుకు యత్నించినా సాధ్యపడలేదు. వరద ప్రవాహం ఈరోజు కూడా కొనసాగడంతో బస్సు ప్రవాహంలో కొట్టుకుపోయింది.

హైదరాబాద్లో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్
మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఆదివారం నుంచి జోరు వానలు పడుతున్నాయి. వాతావరణం చల్లగా అయిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో ముసురు పడుతోంది. మరో మూడు రోజులపాటు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొనడంతోపాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
కాగా, నిజామాబాద్ మెండోర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. గత మూడు రోజులుగా ఎగువ నుంచి వరద పెద్దఎత్తున వస్తుండటంతో ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేసి దిగువకు పంపిస్తున్నారు. మంగళవారం తాజాగా 10 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద జలాలను పంపించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 38 వేల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జలాశయం గేట్లను అధికారులు సోమవారం సాయంత్రమే ఎత్తారు. వరద నీరు పెరిగడంతో ఎస్సారెస్పీ అధికారులు 8 గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇక, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలో గల కౌలాస్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేశారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గల కౌలాస్ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. మహారాష్ట్రలో భారీ వానలతో కౌలాస్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నుంచి దిగువకు దాదాపు వెయ్యి క్యూసెక్కుల వరదను అధికారులు కిందకు పంపిస్తున్నారు.












Click it and Unblock the Notifications