TS Weather: తెలంగాణలోనూ మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, తీవ్రవాయుగుండం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం
గురువారం ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పుదుచ్చేరి, చెన్నై మధ్యలో తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు.
వెల్లూరుకి తూర్పు ఆగ్నేయ దిశగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, క్రమంగా బలపడి రాగల 6 గంటల్లో తీవ్ర అల్ప పీడనంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
దక్షిణ తెలంగాణలో ఎక్కువగా వర్షాలు
ఈ వాయుగుండం నుంచి ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర మీదుగా ఇంటీరియర్ ఒడిశా వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వెల్లడించారు. ఈ రోజు కింది స్థాయి గాలులు తూర్పుదిశగా రాష్ట్రంలోకి వీస్తున్నాయని చెప్పారు. తెలంగాణ దక్షిణ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శక్ర, శనివారాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి.
తెలంగాణలోని ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు
కాగా, దక్షిణ ఏపీ- ఉత్తర తమిళనాడు తీరం వద్ద ఉన్న అల్పపీడనం నైరుతిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాన్ని దాటే అవకాశం ఉన్నదని చెప్పింది. దీని ప్రభావంతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
Recommended Video
తెలంగాణలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
ఆది, సోమవారాల్లోనూ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 27 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఇది ఇలావుండగా, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. శుక్రవారం ఉదయం చెన్నై దక్షిణ కోస్తా జిల్లాల మధ్య తీరం తాకే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ఏపీలోని చిత్తూరు, కడప. నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు వర్షాల కారణంగా సుమారు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు.