మహాలక్ష్మీ పథకం కొనసాగించాలంటే, ప్రభుత్వానికి TSRTC కీలక ప్రతిపాదన..!!
మహాలక్ష్మీ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఆర్టీసీ సైతం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక సందర్భాల్లో ప్రకటించిన సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం అనుమతిస్తున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు అందాయి. మహాలక్ష్మీ పథకం కొనసాగింపులో భాగంగా ప్రభుత్వం నుంచి రీయంబర్స్ మెంట్ పైన ఆర్టీసీ ప్రతిపాదనలు చేసింది. బడ్జెట్ వేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనల పైన తీసుకునే నిర్ణయం ఈ పథకంలో కీలకంగా మారనుంది.
తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం ఎన్నికల హామీ అమల్లో భాగంగా ప్రవేశ పెట్టిన మహాలక్ష్మీ పథకం కు ఆదరణ పెరుగుతోంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఉచిత ప్రయాణం వినియోగించుకుంటున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ లో మహాలక్ష్మీ పథకం కోసం రూ 7,777 కోట్లు ప్రతిపాదించాలని ఆర్టీసీ రిక్వెస్ట్ చేసింది. మహాలక్ష్మీ పథకం తో పాటుగా ప్రయాణ సౌకర్యాలు.. మౌలిక వసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాలని ఆర్టీసీ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించింది. మహాలక్ష్మీ పథకానికి రీబంర్స్ మెంట్ పథకం కింద రూ 7,777 కోట్లు కేటాయించాలని కోరింది. రానున్న ఆర్ధిక సంవత్స రంలో 680 కొత్త బస్సులు కొనుగోలుకు రూ 241.37 కోట్లు కావాలని పేర్కొంది. మౌలిక వసతుల కోసం రూ 442.61 కోట్లు ... కొత్త డిపోలు, బస్ స్టేషన్ల రుణాల చెల్లింపు కోసం రూ 855 కోట్ల మేర సాయం చేయాలని ప్రతిపాదించింది.

పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్న మహిళలు
అనేక కేటగిరీల కింద అమలు చేస్తున్న సబ్సిడీల రీయంబర్స్ మెంట్ కోసం రూ 358 కోట్లు ఇవ్వాలని కోరింది. కాగా... ఇప్పటికే మహాలక్ష్మీ పథకం అమల్లో తెలంగాణ ఆర్టీసీ కొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటికే మహిళలకు రూ 7,000 కోట్ల మేర ఈ పథకం ద్వారా ఉచిత ప్రయాణం అందించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకం ప్రారంభమైన తొలి రోజు ల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజూకు పెరిగింది. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక హైదరాబాద్లో సుమారు 8 లక్షల మంది మహిళలు రోజూ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆర్టీసీ చేసిన ప్రతిపాదనల పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications