TSRTC Strike: మరోసారి డెడ్లైన్ గుర్తు చేసిన కేసీఆర్, ఇక ఆర్టీసీనే ఉండదని తేల్చేశారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఆర్టీసీ సమ్మెపై తీవ్రంగా స్పందించారు. గడువులోపు విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలోకి చేర్చుకునేది స్పష్టం చేశారు. మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని మరోసారి సూచించారు.
ఆర్టీసీ సమ్మె, నవంబర్ 7న హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రగతిభవన్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
గడువులోగా చేరకుంటే..
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాలు కాపాడుకోవడమా? లేక కోల్పోవడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని స్పస్టం చేశారు. గడువు తర్వాత ఏ ఒక్క కార్మికుడిని కూడా విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇక ఆర్టీసీనే ఉండదు..
గడువులోగా కార్మికులు చేరకుంటే మిగిలిన 5వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. మరో ఐదు వేల ప్రైవేటు వాహనాలకు కూడా అనుమతిస్తే ఇక రాష్ట్రంలో ఆర్టీసీనే ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టుకైనా వెళ్తాం..
హైకోర్టులో విచారణను చూసి కార్మికులను యూనియన్లు మభ్యపెడుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె అంశంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం లేదా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
విధుల్లో చేరుతున్నారు.. కానీ..
కాగా, కేసీఆర్ గడువు విధించడంతో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలువురు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. ఆదివారం విధుల్లో చేరిన కొందరు మళ్లీ సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి ప్రకటించడం గమనార్హం. తాజాగా మరోసారి కేసీఆర్ స్పష్టం చేయడంతో మంగళవారం మరింత కొంత మంది విధుల్లో చేరే అవకాశం ఉంది. ఇది ఇలావుంటే,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నవంబర్ 5వ తేదీలోపు విధుల్లో చేరాలని స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవ్వరూ విధుల్లో చేరలేదని, చేరే ప్రసక్తే లేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. జేఏసీలోని అన్ని ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించుకున్నాయని చెప్పారు. నిన్న 11 మంది విధుల్లో చేరితే.. ఐదుగురు ఈ రోజు మళ్లీ వచ్చేశారని తెలిపారు.