అచ్చు ‘యన్టీఆర్’లానే, రాజకీయాల్లేవు: బాలకృష్ణను కలిసిన టీటీడీపీ నేతలు
Recommended Video

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ''యన్టిఆర్'' బయోపిక్ అద్భుతంగా వస్తోందని టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రావు, పెద్దిరెడ్డిలు అన్నారు. 'యన్టిఆర్' పాత్రలో ఆయన తనయుడు, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.

బాలకృష్ణతో టీటీడీపీ నేతలు
ఈ నేపథ్యంలో గురువారం తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రావు, పెద్దిరెడ్డిలు.. '‘యన్టిఆర్'‘ చిత్రీకరణ జరుగుతున్న సెట్స్కు వెళ్లారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో కాసేపు మాట్లాడారు. ఎన్నికల ప్రచారం చేయాలని బాలయ్యను వారు కోరినట్లు తెలిసింది. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఎన్టీఆరే స్వయంగా నటిస్తున్నట్లు..
ఆ తర్వాత టీడీపీ నేతలు మాట్లాడుతూ.. ‘యన్టిఆర్' బయోపిక్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బాలకృష్ణ నటన చూస్తుంటే ఎన్టీఆరే స్వయంగా నటిస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో ఉన్న తమ అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాలయ్యతో పంచుకున్నారు ఈ నేతలు.

షూటింగ్ చూడటానికి మాత్రమే వచ్చామంటూ..
‘యన్టిఆర్' అండదండలతో ఈ ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కేవలం షూటింగ్ చూడటానికి మాత్రమే ఇక్కడికి వచ్చామని అన్నారు. రాజకీయాలపై బాలకృష్ణతో చర్చించలేదని తెలిపారు.

రెండు భాగాలుగా యన్టిఆర్
కాగా, ‘యన్టిఆర్' పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు. కాగా, ‘యన్టిఆర్' బయోపిక్ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న కథనాయకుడు, జనవరి 24న మహానాయకుడిగా విడుదల చేయనున్నారు.

కీలక పాత్రల్లో ప్రముఖ నటులు
‘యన్టీఆర్' బయోపిక్లు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘యన్టిఆర్' సతీమణిగా విద్యాబాలన్, చంద్రబాబుగా దగ్గుబాటి రానా, అక్కినేనిగా సుమంత్, శ్రీదేవిగా రకుల్ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.












Click it and Unblock the Notifications