చంద్రబాబుపై టీ మంత్రి సెటైర్, హెచ్చరించిన తలసాని
హైదరాబాద్: తెరాసలో ఉన్న వారంతా తన స్కూల్ వారేనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం స్పందించారు.
తాము టిడీపీలో చేరినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని విమర్శించారు. ఎన్టీఆర్ స్కూలులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాఠాలు చెబుతున్నప్పుడు చంద్రబాబు వచ్చి చేరారని ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు తన స్కూలు నుండి కేసీఆర్, తెరాస నేతలు వచ్చారని చెప్పడం విడ్డూరమన్నారు.
పన్ను ఎగవేస్తే చర్యలు: తలసాని
ట్యాక్స్ చెల్లింపులకు ఆన్లైన్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. అందరు ట్యాక్స్ చెల్లించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కొన్ని కార్పోరేట్ ఆసుపత్రులు, కొన్ని సినిమా హాల్స్ ట్యాక్స్ చెల్లించడం లేదన్నారు. ట్యాక్స్ చెల్లించని వారి వివరాలు అందజేస్తే పారితోషికం ఇస్తామన్నారు.
మరోవైపు, సినిమా రంగంలో అందిస్తున్న నంది అవార్డు పేరు మారనుంది. ఉత్తమ సినిమా, నటీనటులు, దర్శకులతో పాటు పలు విభాగాల్లో అందిస్తున్న ఈ అవార్డు పేరు మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అయితే పేరు ఇంకా ఖరారు కాలేదన్నారు.