విషాదం: మ్యాన్హోల్లో పడి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు గల్లంతు, ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని ఎల్పీనగర్ పరిధి సాహెబ్నగర్లో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి.మ్యాన్హోల్లో ఊపిరాడక మృతి చెందిన ఒక కార్మికుడిని బయటకి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతులు చంపాపేట్, సరూర్నగర్ ప్రాంతానికి చెందినవారని, పారిశుద్ధ్య పనులతోనే జీవనోపాధి పొందేవారని స్థానికులు చెప్పారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కాగా, సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా మ్యాన్ హోల్లోకి దిగడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇటువంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వీరి కుటుంబాలకు పరిహారం అందించాలని స్థానిక కార్పొరేటర్ డిమాండ్ చేశారు.
మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఆత్మహత్య
ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్ మహ్మదాబాద్ ప్రమీల(45) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకున్నారు. భర్త ఇంటికొచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
2014లో కాంగ్రెస్ తరపున ఎంపీటీసీగా గెలుపొందిన ప్రమీల.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020లో 11 వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు. మృతురాలికి కుమారుడు, కుమార్త ఉన్నారు. ప్రమీల భర్త యాదిగిరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.