కరోనా కాటు: ఇద్దరు మావోయిస్టు నేతలు మృతి, ఓ మహిళా నేత కూడా
హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా అరణ్యంలో ఉండే మావోయిస్టులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కరోనాతో పలువురు మావోయిస్టులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఇద్దరు మావోయిస్టు నేతలు మరణించినట్లు అధికారికంగా ప్రకటించింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్ భారతక్కలు కరోనాతో మరణించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

చాలా కాలంగా బ్రాంకైటీస్, అస్తమా వ్యాధులతో బాధపడుతున్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ జూన్ 21న ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారని తెలిపారు. ఆ తర్వాతి రోజు ఉదయం 9.50 గంటలకు సిద్ధబోయిన సారక్క కూడా కరోనా లక్షణాలతో మరణించారు. జూన్ 22న వారిద్దరి పేరిట సంస్మరణ సభ నిర్వహించినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు మావోయిస్టు పార్టీ తరపున సంతాపం తెలియజేశారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన హరిభూషణ్ హన్మకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే.. 1991లో ఆర్ఎస్యూ ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2018లోనే కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. 33 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన హరిభూషణ్ ఎన్నోసార్లు చావు అంచులకు వెళ్లి వచ్చారు. తుపాకీ తూటాలను రెప్పపాటులో తప్పించుకున్నారు.












Click it and Unblock the Notifications