హైదరాబాద్ పాతబస్తీలో కూలిన భవనం: ఇద్దరు మృతి
హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని పురానాపూల్ హుస్సేనిఅలం కబూతర్ ఖానా దగ్గర నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన స్థానిక ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నందూ, వెంకటయ్యలుగా గుర్తించారు. భవనం కూలిన ఘటనపై పోలీసులు, కార్మికశాఖ విచారణ చేపట్టారు. భవనం కూలిన ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు.

భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితుల వివరాలును కార్మికశాఖ సిబ్బంది తెలుసుకుంటున్నారు.
బాధితులకు న్యాయం చేస్తామని కార్మికశాఖ అధికారులు హామి ఇచ్చారు. భవన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కూలీలు మృతి చెందారని బాధితుల బంధువులు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని బంధువులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications