రథయాత్రలో అపశృతి: ఇద్దరు మృతి, పది మందికి గాయాలు, విద్యుత్ తీగలు తాకడంతోనే
నారాయణపేట: జిల్లాలోని దామరగిద్ద మండలం బాపన్పల్లి శివారులోని శ్రీవెంకటేశ్వర దేవాలయ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథసప్తమి సందర్భంగా శుక్రవారం రథయాత్ర నిర్వహించారు.
దేవాలయానికి కొద్ది దూరంలో స్వామివారి రథాన్ని లాగుతుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే వారు చికిత్స పొందుతూ మరణించారు.
గాయాలపాలైన మరో 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను దుద్దిమూతల హన్మంతు(40), చంద్రప్ప(42)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. ఎంతో వేడుకగా సాగుతున్న కార్యక్రమం ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చికిత్స పొందుతూ అర్చక సంఘం అధ్యక్షుడు మృతి
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు కనకంబట్ల వెంకటేశ్వర శర్మ శుక్రవారం మృతి చెందారు. విహారయాత్రలో బాగంగా జనవరి 24న సోమనాథ ఆలయానికి వెల్తుండగా ద్వారక వద్ద ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ అడిక్మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాలస్వామి దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ రమణలు ప్రమాద స్థలంలోనే మరణించారు. వెంకటేశ్వర శర్మ, ఈవో సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వరశర్మ చికిత్స పొందుతూ మరణించారు.