టీడీపీకి మరో షాక్, అలా చెప్పిన కొన్నాళ్లకే: టీఆర్ఎస్లోకి ఉమామాధవ రెడ్డి, కొడుకు
భువనగిరి: తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 14వ తేదిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు ఉమ కూడా చేరే అవకాశాలున్నాయి.
Recommended Video
టీడీపీ పనైపోయిందని తెలుసు, రేవంత్ వెంటే వెళ్లేదాన్ని: బాబుకు ఉమామాధవరెడ్డి షాక్
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇటీవల వరుస షాక్లు తగులుతున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం మరికొందరు టీడీపీ నేతలు ఇతర పార్టీలలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఉమామాధవ రెడ్డి కూడా రేవంత్తో పాటు కాంగ్రెస్లో చేరుతారని భావించారు.
రేవంత్ వెళ్లినప్పటి నుంచే చర్చ
రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఉమా మాధవ రెడ్డి ఇతర పార్టీలోకి వెళ్లే అంశంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు ఆమె తనయుడు సందీప్ టీఆర్ఎస్లో చేరుతున్నారు. సందీప్తో పాటు ఉమా మాధవ రెడ్డి కూడా అధికార పార్టీలో చేరుతారని అంటున్నారు.
అప్పుడే టీడీపీపై వ్యాఖ్యలు
ఇటీవల ఆమె టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో అప్పుడే ఆమె పార్టీ మారుతారని అందరికీ అర్థమైంది. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనే విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. నక్సలైట్ల చేతిలో చనిపోయిన నేతలకు ఇచ్చే ఇంటి ప్లాట్ పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె లాబీల్లో గత నెల మాట్లాడారు. సీఎంను ఒంటరిగా కలిస్తే తెరాసలో చేరుతారని ప్రచారం జరుగుతుందని, అందుకే తాను సండ్ర వెంకట వీరయ్యతో కలిసి కేసీఆర్ను కలిశానని చెప్పారు.
పిలుపు వస్తే వెళ్తానని చెప్పారు, అన్నట్లుగానే
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి హామీ వచ్చినందు వల్లే ఆ పార్టీలో చేరి ఉంటారని, తనకు ఎలాంటి హామీ రాలేదన్నారు. తనకు కూడా వచ్చి ఉంటే ఢిల్లీకి వెళ్లి ఉండేదానిని అని చెప్పారు. అయితే తనకు తెరాస నుంచి గతంలో పిలుపు వచ్చిందని, ప్రస్తుతం ఎవరూ అడగడం లేదని, అడిగితే ఆలోచిస్తానని చెప్పారు.
హామీ వచ్చిందా
ఉమా మాధవ రెడ్డి అలా చెప్పిన కొద్దిరోజులకే ఇప్పుడు ఆమె తనయుడు సందీప్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఆమెకు తెరాస నుంచి పిలుపు వచ్చి ఉంటుందని, ఆ పార్టీతో జరిగిన చర్చల్లో ఆమెకు హామీ వచ్చినందు వల్లే కొడుకు తెరాసలోకి వెళ్తున్నారని అంటున్నారు. కొడుకుతో పాటు ఆమె కూడా తెరాసలోకి వెళ్తారని చెబుతున్నారు.