కేసీఆర్ కు ఊహించని షాక్.. ట్విస్ట్ ఇచ్చిన ఎంఐఎం
అక్బరుద్దీన్.. వచ్చే ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని, కనీసం 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఉండేటట్లు చూస్తామన్నారు
MIM పార్టీ బీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రత్యర్థులవైపు నుంచి వచ్చిన మాటలోని లోపాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. భారతీయ జనతాపార్టీకి మేలు చేయడానికి రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీచేసి మైనార్టీల ఓట్లను చీలుస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన ఆరోపణలను వాస్తవం చేసే దిశగా ఆ పార్టీ కదులుతోందా? అనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు ఔనంటున్నారు.

50 స్థానాల్లో పోటీచేస్తామన్న అక్బరుద్దీన్
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడుగురు సభ్యులున్న పార్టీకి గంటలకద్దీ సమయం ఇవ్వడం భావ్యం కాదని స్పీకర్ కు సూచించారు. దీంతో అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని, కనీసం 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఉండేటట్లు చూస్తామన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి భారత రాష్ట్ర సమితితో దోస్తీ ఉండే అవకాశం లేదని, ఆ దిశగానే ఎంఐఎం కదులుతోందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీ పదే పదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే వ్యూహంలో ఏమైనా మాట్లాడారా? అనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎంఐఎం విడిగా పోటీచేస్తే బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుందా? అనే కోణంలోను విశ్లేషణలు జరుగుతున్నాయి.

బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందంటూ..
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జాతీయ పార్టీగా ఎంఐఎం పోటీచేసేది. ఎక్కువ సంఖ్యలో స్థానాలను గెలుచుకోకపోయినప్పటికీ ఒకటీ అరా గెలుచుకునేది. అవి కూడా కొన్ని రాష్ట్రాల్లో రాలేదు. కానీ ఎంఐఎం పోటీచేయడంవల్ల మైనార్టీల ఓట్లు భారీగా చీలిపోయి భారతీయ జనతాపార్టీ గెలవడానికి దోహపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల ఎన్నికలను కొన్నాళ్లుగా పరిశీలించుకుంటూ వస్తే జరుగుతుంది ఇదేనని సీనియర్ రాజకీయ వేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

బెంగాల్ లో మైనార్టీలను అప్రమత్తం చేసిన దీదీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఎంఐఎం పోటీచేసింది. మతం పేరుతో ఓట్లు చీల్చడానికి భారతీయ జనతాపార్టీ తరఫున వారి మిత్రులు ఎంఐఎం వచ్చి పోటీచేస్తోందని, మైనార్టీలెవరూ దాన్ని గుర్తించవద్దని మమతాబెనర్జీ ప్రచారం చేసింది. అందుకు తగ్గట్లుగానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలంతా గుంపగుత్తాగా తృణమూల్ కాంగ్రెస్ కే ఓట్లేశారు. ఎంఐఎంకు ఇక్కడ నిరాశ తప్పలేదు. అంతేకాదు.. అనుకున్నస్థాయిలో ఓట్లు చీల్చలేకపోయింది. తాజాగా అక్బరుద్దీన్ చేసిన ప్రకటన భవిష్యత్తు పరిణామాలను సూచిస్తోందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఎంఐఎం బీఆర్ఎస్ తో కాకుండా విడిగా పోటీచేస్తే ఓట్ల చీలిక ఉంటుంది. మమతా బెనర్జీ చెప్పినట్లు బీజేపీకి సహకరించడానికే పోటీ చేస్తుందా? లేదంటే బీఆర్ఎస్ తో స్నేహాన్ని కొనసాగిస్తుందా? అన్నది తేలడానికి కొద్దికాలం వేచిచూడక తప్పదు












Click it and Unblock the Notifications