విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: తిరుపతి వరకు వందేభారత్ రైలు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఎకే జైన్ తోపాటు కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
రూ. 719 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
రూ. 719.30 కోట్లతో సికంద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫారాలను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేగాక, 26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దక్షిణ భారత్లో ఉత్తమ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ ను తీర్చిదిద్దుతామని తెలిపారు. మూడు దశల్లో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కాజీపేటలో రూ. 384 కోట్లతో వ్యాగన్ వర్క్షాప్
ఇక, కాజీపేటలో రూ. 384 కోట్లతో వ్యాగన్ వర్క్ షాప్ కోసం టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. దీనికోసం 150 ఎకరాల భూసేకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో రెండు మూడు ఎకరాల భూమి అదనంగా అవసరమవుతుందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు తెలంగాణ రాష్ట్రం నిధులు ఇవ్వాల్సి ఉందని, వాటిని విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్-తిరుపతి వయా విజయవాడ
విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైళ్లు రాబోయుతున్నాయన్నారు. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వే శాఖలను కోరామని తెలిపారు. 1300 కిలోమీటర్ల కొత్త లైన్ల భూసేకరణ కూడా కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. కాగా, ఇప్పటికే దేశంలోని పలు మార్గాల్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే.