అమరావతి- బెంగళూరు- హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్: ఓపెన్ అయిన రేవంత్
తెలంగాణ.. నేడు ప్రజా పాలన దినోత్సవాలను ఘనంగా జరుపుకొంటోంది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను అధికార యంత్రాంగం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను రెపరెపలాడించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావించారు.
మూసీని పునరుజ్జీవం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సబర్మతి, యమునా, గంగాలకు దీటుగా మూసీని పునర్నిర్మిస్తామని అన్నారు. డిసెంబర్ 9 నాటికి మూసీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో తెలంగాణ చరిత్రకారుల విగ్రహాలు పెడతామని, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎదురొడ్డి నిలబడతానని అన్నారు. మూసీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాచరికానికి గోరికట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజుగా సెప్టెంబర్ 17వ తేదీని అభివర్ణించారు.

లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారుతోందని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్ కు కేంద్రబిందువు అయిందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే వందేళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా హైదరాబాద్ కు గోదావరి జలాలు తీసుకువస్తున్నామని, దీనికోసం 7,360 కోట్ల రూపాయలతో గోదావరి 2, 3 దశల పనులను ఇటీవలే ప్రారంభించామని గుర్తు చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉండబోతున్నాయని, ఓఆర్ఆర్పై తలపెట్టిన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఒక గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుందని అన్నారు. 24,000 కోట్ల రూపాయల అంచనాతో మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత మంచి చేయడమే బాధ్యతగా పాలన సాగుతుందని, ప్రతి పేదవాడిలో సంతోషమే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయంలో తెలంగాణను దేశంలో రోల్ మోడల్ గా నిలుపుతామని రేవంత్ రెడ్డి అన్నారు. త్యాగాలకు చిహ్నమైన తెలంగాణలో మత్తుకు స్థానం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్తో పెడదోవ పడుతున్నారని, డ్రగ్స్ దందాను అడ్డుకోవడం కొందరికి నచ్చకపోయినా వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ దందాలో ఎవరి బంధువులు ఉన్నా ఎట్టిపరిస్థితుల్లోనూ వదలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వాళ్లు ఫామ్హౌస్లోనే కాదు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని రేవంత్ చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా నిలబెడతామని, ఇందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని, ప్రభుత్వంతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.
ప్యూచర్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తోన్నారని రేవంత్ ఆరోపించారు. మంచి చేస్తుంటే తట్టుకోలేరని, అందుకే రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటోన్నారని ధ్వజమెత్తారు. ప్యూచర్ సిటీపై రైతులకు అవగాహన కల్పిస్తామని, వారికి సరైన నష్టపరిహారం ఇస్తామని అన్నారు. ప్యూచర్ సిటీకి బుల్లెట్ రైలు కూడా రానుందని రేవంత్ రెడ్డి చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ స్వార్థంతో కొందరు ప్రయత్నించడం వారికే మంచిది కాదని అన్నారు.
కృష్ణ, గోదావరిలో ప్రతి చుక్క హక్కుపైనా రాజీపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యాయ పోరాటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. గత పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంతో నష్టపోయామని, కృష్ణాలో 904 టీఎంసీ సాధించేందుకు ప్రభుత్వం వాదన వినిపిస్తామని అన్నారు. ఎవరు అడ్డంకులు కల్పించిన ఎస్ఎల్బీసీని పూర్తిచేస్తామని, దీనికి డెడ్ లైన్ కూడా పెట్టామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications