సూపర్ స్పైడర్లకు వ్యాక్సీన్.!ఈ నెల 28, 29 రెండు రోజుల పాటు టీకాలు వేసేందుకు టీ సర్కార్ ఏర్పాట్లు.!
హైదరాబాద్ : సాద్యమైనంత వేగంగా సూపర్ స్పైడర్లకు వ్యాక్సీన్ వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో బాగంగా ముందుగా రంగారెడ్డి జిల్లా లో ఈ సూపర్ స్పైడర్లకు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28, 29 తేదీలలో సూపర్ స్పెరడర్ లకు వాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రంగాజిల్లా కలెక్టర్ అమాయ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ అమాయ్ కుమార్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28, 29 రెండు రోజుల్లో జర్నలిస్టులు, చౌక ధరల దుకాణాల డీలర్లు, సహాయకులు, ఎల్పిజి డీలర్లు, పెట్రోల్ బంక్ లో పని చేసే వర్కర్లు, మందుల దుకాణాలు డీలర్లు, పేస్టిసైడ్ డీలర్లు, సీడ్ డీలర్లకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు గాను అన్ని మండల కేంద్రాల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ వాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రేపటిలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ముఖ్యంగా టెంట్, తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అక్రిడేషన్ కార్డు పొందిన జర్నలిస్టులు ఈ వ్యాక్సినేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు గాను డాక్టర్లను, అవసరమైనంత స్టాఫ్ నర్సులు, నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ రెండు రోజుల్లో వాక్సిన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు గాను సంబంధిత అధికారులు వాక్సిన్ ఇచ్చే వారి జాబితాను రూపొందించి మండల కేంద్రాలకు పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాక్సిన్ ఇవ్వాలని ఆయన తెలిపారు. సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి గీతా రెడ్డి, సివిల్ సప్లయిస్ డి ఎస్ ఓ మనోహర్ రాథోడ్, డిపిఆర్ ఓ పద్మశ్రీ, తదితరులు హాజరయ్యారు.