కేసీఆర్కు షాక్, అక్కడ సంబరాలు: ఎవరికి దేనితో ప్రయోజనం?
123 జీవో కింద భూములు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసీ, కెసీఆర్కు గట్టి షాకిచ్చింది.
హైదరాబాద్: భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన 123 జీవో కింద భూములు కొనుగోలు చేయడాన్ని నిలిపివేయాలని హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసీ, కెసీఆర్కు గట్టి షాకిచ్చింది. భూముల అమ్మకానికి రైతులు ముందుకొచ్చినా, ఈ ఒప్పందాల వల్ల రైతుల భూములపై ఆధారపడ్డ కూలీలు, చేతివృత్తుల వారి హక్కులు హరించుకుపోతాయంది.
జీవో 123 ప్రకారం భూసేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ వందమందికి పైగా రైతులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించవచ్చునని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ హర్షం
హైకోర్టు తీర్పు పైన విపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవో 123పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది. ఇది పేదలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జీవో 123పై విపక్షాల మాటవినని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
రైతుల భూములు తిరిగిచ్చేంత వరకూ పోరాడుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి చెప్పారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి
గుణపాఠంలాంటివనీ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి 2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరపాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. జాతీయ భూసేకరణ చట్టం 2013 అమలు చేయాలన్నారు.
వేములఘాట్ సంబరం
హైకోర్టు మధ్యంతర తీర్పు పైన వేములఘాట్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ కింద ఎక్కువగా ముంపుకు గురయ్యేది ఇదే. ఈ జీవో పైన గ్రామస్తులు మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు వేములఘాట్ ప్రజలు హర్షిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతున్నారు. కోర్టు తీర్పు జీవో 123 సరికాదని తేలిందని అంటున్నారు.
2015లో జీవో వచ్చింది
సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టేందుకు, ఇందుకు భూసేకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123 తీసుకు వచ్చింది. దీనిని రైతులు, కూలీలు, చేతి వృత్తుల వారు వ్యతిరేకిస్తూ కోర్టుకు ఎక్కారు. దీనిపై హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై వాదనలు విన్న ధర్మాసనం నవంబర్ 23న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, గురువారం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నష్టం లేదా?
ఇదిలా ఉండగా, జీవో 123 కింద భూసేకరణ చేపట్టవద్దంటూ హైకోర్టు ఇచ్చిన స్టేతో ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏం లేదని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు కోరుకున్నట్లుగా భూసేకరణ చేస్తున్నందున.. కోర్టు ఉత్తర్వులపై మళ్లీ అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తోందని తెలుస్తోంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారమే ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇవ్వడం, భూసేకరణ జరుగుతుండటంతో పాటు.. జీవో 123 కింద సేకరించిన భూమి సైతం భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే అధికారికం అవుతుందంటున్నారు.