మళ్లీ అదేమాట: తెలంగాణ వేడుకల్లో వెంకయ్య, ఏపీకి ఐదేళ్లలో..
లండన్: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శనివారం నాడు లండన్లో తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో ఏపీకి, తెలంగాణలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చి తీరుతామని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎలాంటి మార్పులు వచ్చీందీ వెంకయ్య నాయుడు వివరించారు. ప్రధానిగా ఆయన రీఫార్మర్ అని, పెర్ఫార్మెన్స్, ట్రాన్స్ఫార్మర్గా అభివర్ణించారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశం సమర్థ, సుస్థిర నాయకత్వంలో ముందడుగు వేస్తోందన్నారు.
బలమైన ఏపీ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏన్డీయే ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల 14వ ఆర్థిక సంఘం ద్వారా ఏఫీకి అయిదేళ్లలో 2.93 లక్షల కోట్ల వనరులు అందుతున్నట్లు చెప్పారు.
తాను ఏపీ, తెలంగాణ నుంచి ఎన్నిక కాకపోయినప్పటికీ అక్కడి ప్రజల సమస్యలపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నానని చెప్పారు. తాను తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లనప్పటికీ... అని వెంకయ్య నాయుడు పలుమార్లు చెబుతున్నారు.
కాగా, ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస తెలంగాణీయులందరు తెలంగాణలోని తమ గ్రామాలకు సేవ చేయాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా అభివృద్ధిలో భాగస్వాములవుతూనే స్వదేశానికి సేవలందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను మెల్బోర్న్లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు.