మోడీని ప్రపంచమే గుర్తించింది, అరాచకం సృష్టిస్తున్నారు: వెంకయ్య
హైదరాబాద్: ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని గుర్తించిందని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ విచ్చేసిన వెంకయ్యను తెలంగాణ బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదవులు ఉన్నా లేకపోయినా మనం బీజేపీలో ఉంటున్నామని చెప్పారు. ఎందుకంటే, దేశానికి బీజేపీ వల్లనే మేలు జరుగుతుందని మనం భావిస్తున్నామన్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. తనకు బీజేపీయే తల్లి లాంటిది అన్నారు. తనను బీజేపీ ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లిందని చెప్పారు.
పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారు ఎంతోమంది ఉన్నారన్నారు. పదవి ఉన్నా, లేకపోయినా ఎంతోమంది పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ కోసం, దేశం కోసం పని చేస్తూ వచ్చామి చెప్పారు. బీజేపీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉందన్నారు.
అసోంలో సూర్యోదయం అయితే భారతదేశంలో సూర్యోదయం అయినట్లు అని, అలాంటి అసోంలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. దేశంలో క్రమంగా కాంగ్రెస్ పడిపోతుందని, బీజేపీ ఎదుగుతుందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కర్నాటకలో అధికారంలోకి రావడంలో అనుమానం లేదన్నారు.
కేరళలో బీజేపీ కార్యకర్తలను చంపేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఓ టీచర్ను అయితే, ఆయన క్లాస్ చెబుతుండగా క్లాస్లోకి వెళ్లి మరీ చంపేశారన్నారు. మొన్న ఎన్నికల తర్వాత కూడా దారుణాలు జరిగాయన్నారు. మన తదుపరి లక్ష్యం కేరళ అన్నారు.
పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసిపోయారని, అయినా మనం 10.7 శాతం ఓట్లతో దూసుకెళ్తున్నామని చెప్పారు. దేశం నలుమూలలా బీజేపీ విస్తరించిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ప్రపంచంలోనే మన కన్నా పెద్ద పార్టీ లేదన్నారు.
వాజపేయి, అద్వానీ వంటి నేతలు మనకు ఆదర్శమన్నారు. మోడీ వంటి గట్టి నేత ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా భౌగోళికంగా చూస్తే బీజేపీ 46 శాతం విస్తరించి ఉందన్నారు. ముప్పై ఏళ్ల తర్వాత సంపర్ణ మెజార్టీ మనకు వచ్చిందన్నారు.
ఏ మోడీకి అయితే అమెరికా ఆయనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించిందో, ఇప్పుడు అదే మోడీకి అగ్రదేశం రెడ్ కార్పేట్ పరుస్తోందన్నారు. ప్రధాని మోడీకి ఆప్ఘనిస్తాన్ అత్యున్నత పురస్కారం దక్కిందన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు మోడీ నాయకత్వాన్ని గుర్తించిందని చెప్పారు.
2019లో మళ్లీ మోడీ రావాలనేదే మన లక్ష్యమన్నారు. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. చైనాలోను అలాగే ఉందన్నారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం ఏదైనా ఉందా అంటే భారత దేశం మాత్రమే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
గత ఎన్నికలలో కేరళలో 14.5 శాతం ఓట్లు సాధించామని చెప్పారు. ఈ అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ ఎప్పుడు గరీబీ హటావో అని నినాదం ఇచ్చింది తప్ప ఏం చేయలేదన్నారు. దేశంలో హింసావాదం, మతచాందసవాదం, వేర్పాటువాదం చాలా ఉందన్నారు. కమ్యూనిస్టులు అరాచకవాదం సృష్టిస్తున్నారన్నారు.