సోనియాను బాధపెడ్తున్నారు, టిఆర్ఎస్ మునుగుతుంది: పార్టీ వీడిన నేతలపై వీహెచ్, పాల్వాయి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నవారిపై ఆ పార్టీ సీనియర్ నేతలు వి హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపి వీహెచ్, పాల్వాయి శనివారం మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినా పార్టీని నేతలు వీడటం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి బాధ కలిగిస్తోందని అన్నారు.
పార్టీలు మారేవారే అతిపెద్ద అవినీతిపరులని వీహెచ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వదులుకుని తెలంగాణ ఇచ్చిన సోనియాకు ద్రోహం చేయొద్దని, అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. నాయకులు, కార్యకర్తలు ఓపిక పట్టాలని సూచించారు. అలాగే పార్టీ మారే వారికి భరోసా ఇవ్వడంలో సీనియర్లు విఫలమవుతున్నారని, అధికారం కోసం పార్టీ మారడం నీచ రాజకీయమని, నిజమైన నాయకులెవరూ పార్టీని వీడారని వారన్నారు.
ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. టిఆర్ఎస్ పెద్దలు సొంత క్యాడర్నే తయారుచేసుకోవాలని వీహెచ్ సూచించారు. కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటే బరువు పెరిగి టిఆర్ఎస్ మునుగుతుందని వ్యాఖ్యానించారు.
పార్టీని వీడొద్దని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పిలుపునివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారని, అటువంటి వ్యక్తి పార్టీ మారుతాననడం సరికాదని వీహెచ్ హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదనే అంచనాతో పార్టీని వీడటం సరికాదని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడంతోనే పక్క చూపులు చూస్తున్నారని మండిపడ్డారు. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు మాత్రం పార్టీలోనే కొనసాగుతారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు.