పరిపూర్ణానందస్వామికి క్షమాపణలు చెప్పాలి, ప్రభుత్వానికి డిమాండ్
హైదరాబాద్: శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిని నగరం నుంచి బహిష్కరించిన అంశంపై హిందువుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు గురువారం హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
హైదరాబాదుతో పాటు తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పరిపూర్ణానంద స్వామికి మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. హైదరాబాదులోని ఆరాంఘర్ వద్ద చేపట్టిన ధర్నా కారణంగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది.

విహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అమీర్ పేట మైత్రివనం వద్ద కూడా రాస్తారోకో నిర్వహించారు. కోఠి సెంటర్లో విహెచ్పీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
స్వామీజీని బహిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం హిందూ సమాజాన్ని అవమానించిందని, ఆయనపై బహిష్కరణను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం స్వామీజికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి, ఆయనను రాష్ట్రంలోకి ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, మేడ్చల్, వరంగల్ తదితర పలుచోట్ల కూడా విశ్వహిందూ పరిషత్, బీజేపీ, బజరంగ్ దళ్, హిందూవాహిని నిరసన చేపట్టాయి. రహదారులను ముట్టడించడంతో పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications