కాలేజీలో కూతురు ఆత్మహత్య?: శోకంలో ఉన్న తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్, స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: ఫ్ల్రెండ్లీ పోలీస్ అంటూ అటు సీఎం కేసీఆర్.. ఇటు మంత్రి కేటీఆర్.. పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా, తన కూతురు చనిపోయి బాధలో ఉన్న తండ్రిని ఓ పోలీసు బూటు కాలితో తన్నడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పటాన్చెరులోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సంధ్యారాణి(16) అనే విద్యార్థిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం మధ్యాహ్నం సంధ్యారాణి బాత్రూంలోకి వెళ్లి గీజర్ పైపునకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా.. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తన కూతురుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, కాలేజీ యాజమాన్యమే తన కూతురు మరణానికి కారణమని, ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
శోకంలో ఉన్న తండ్రిని కాలితో తన్ని పోలీసు..
కాగా, సంగారెడ్డి జిల్లా బానూరు పోలీసులు సంధ్యారాణి మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికీ తరలించారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, బంధువులు బుధవారం మార్చురీ తాళాలు పగులగొట్టి.. మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని మళ్లీ మార్చురీకి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. సంధ్యారాణి తండ్రి సుధాకర్ అడ్డుపడ్డారు. ఫ్రీజర్ను గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్కు చెందిన శ్రీధర్ అనే కానిస్బేటుబల్ బూటుకాలితో ఆయన్ని తన్ని, పక్కకు లాగిపడేశాడు. అనంతరం సంధ్యారాణి మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు పోలీసులు.
పోలీసు తీరుపై విమర్శలు..
తన కూతురు చనిపోయి తీరని శోకంలో ఉన్న తండ్రిని కానిస్టేబుల్ కాలితో తన్నిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు పోలీసుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు.కానిస్టేబుల్ శ్రీధర్ను పోలీసు హెడ్ క్వార్టర్స్(ఏఆర్)కు అటాచ్ చేశామని, ఘటనపై విచారణ జరిపిస్తున్నామని సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ తెలిపారు.
ఆత్మహత్యగా చిత్రీకరించారు..
తమ కూతురు గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, అదే విషయాన్ని తమకు ఫోన్ ద్వారా తెలిపిందని.. కళాశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదని సంధ్యారాణి తండ్రి సుధాకర్ ఆరోపించారు. తీవ్ర జ్వరంతో చనిపోతే.. గొంతుకు తాడుకట్టి టాయ్లెట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించారన్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తుంటే పోలీసులు తమపై లాఠీఛార్జీ చేసి గాయపర్చారని వాపోయారు.
Recommended Video
కనీస మానవత్వం ఉండాలంటూ కేటీఆర్..
కూతురు చనిపోయి తీవ్ర శోకంలో ఉన్న తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్పై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. సదరు కానిస్టేబుల్ కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారని అన్నారు. విషాదంలో ఉన్నవారి పట్ల సానుభూతి ప్రదర్శించడం, సున్నితంగా వ్యవహరించడం ప్రభుత్వ ఉద్యోగుల కనీస ధర్మమని కేటీఆర్ హితవు పలికారు.