లాల్ దర్వాజ అమ్మవారికి విజయశాంతి బంగారు బోనం, ఏం చెప్పారంటే
హైదరాబాద్: లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి, దానం నాగేందర్, టీజేఎస్ నేత కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు బోనం సమర్పిస్తానని అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత ఆమె ప్రజల్లోకి వచ్చారు.
సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేవిధంగా బోనాలు నిర్వహించుకుంటున్నామని, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆ ఫలాలు అందరికీ చేరాలన్నారు. ఉద్యమం సమయంలో ఢిల్లీలో సైతం బోనాలు నిర్వహించామని కోదండరాం అన్నారు.