వారు నలుగురు దొంగలు: కేసీఆర్-కవితలపై విజయశాంతి, సిద్ధూ, ఖుష్బూ, డీకే అరుణ నిప్పులు
హైదరాబాద్/నిజామాబాద్: బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణలో దొరల పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమె రుణం తీర్చుకోవాలని చెప్పారు.
నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ?: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
వారి వద్ద డబ్బు తీసుకొని, మాకు ఓటు వేయండి
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని విజయశాంతి చెప్పారు. కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పంచుతున్న డబ్బులు తీసుకోండని కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి, మహాకూటమి అభ్యర్థులకు వేయాలని విజయశాంతి సూచించారు.
తెరాస గ్రాఫ్ పడిపోతుంది
రోజు రోజుకు తెరాస గ్రాఫ్ పడిపోతుందని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ వేరుగా అన్నారు. ఓటమి భయంతోనే కూటమిపై తెరాస నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. తెరాసను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.
కేసీఆర్ పైన సిద్ధూ ఆగ్రహం
ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉండాలని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ హైదరాబాదులో అన్నారు. కేసీఆర్ రూ.300 కోట్ల బంగ్లా నుంచి బయటకు రారని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పారు. కేసీఆర్ ఆస్తులు ఈ నాలుగున్నరేళ్లలో నాలుగు వందల రెట్లు పెరిగాయని చెప్పారు.
కేసీఆర్ అలీబాబా
కేసీఆర్ అలీబాబా అయితే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మరో ఎంపీ సంతోష్ నలుగురు దొంగలు అని విమర్శించారు. తెలంగాణలో మహిళా సాధికారత ఎక్కడ అని ప్రశ్నించారు. కవిత ఉంటే సరిపోయిందా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు రుణాలు ఇవ్వరని, కానీ అంబానీ, అధానీలకు మాత్రం రుణాలు మాఫీ చేస్తారని ఎద్దేవా చేశారు. మోడీ ఏ దేశమైనా వెళ్లవచ్చునని, అలాగే నేను పాకిస్తాన్ వెళ్తే తప్పేమిటని ప్రశ్నించారు. నీరవ్ మోడీ, చోక్సీలను తీసుకు రాలేకపోతున్నారని చెప్పారు.
కేసీఆర్పై ఖుష్బూ నిప్పులు
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ అంతకుముందు ఆరోపించారు. కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళకు కూడా అవకాశమివ్వకపోవడం ఆయనకు మహిళలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కనీసం రాష్ట్ర మహిళా కమిషన్ను కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని, కేసీఆర్ కుమార్తె కవిత మాత్రమే ఆర్థికంగా లాభ పడ్డారని, మహిళలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు.