వారు మాట్లాడితే పిల్లలు టీవీ చూసే పరిస్థితి లేదు: విజయశాంతి చురకలు
తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందిస్తూ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం వనస్థలిపురంలో మహిళా దినోత్సవ వేడుకల్లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
మహిళకు మెతక వైఖరి సరికాదని.. దృఢంగా ఉండాలని విజయశాంతి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఫాంహౌస్లో ఉంటూనే సీఎం కేసీఆర్ రూ. 4 లక్షలు తీసుకుంటున్నారని అన్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మాత్రం ఇవ్వరని విజయశాంతి ఆరోపించారు.

అధికార పార్టీ మహిళా సర్పంచ్ పట్ల అసభ్యంగా మాట్లాడిన ఓ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విజయశాంతి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏనాడైనా.. మహిళలను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ ఇదే విధంగా చలనం లేకుండా ఉంటున్నాడని అన్నారు. అవసరానికి పని చేయించుకుని అవతలికి పొమ్మనే వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.
మహిళలు స్వతంత్రంగా బతికే స్వేచ్ఛను ఇచ్చే విధంగా సీఎం విధానాలు లేవన్నారు విజయశాంతి. కల్వకుంట్ల తండ్రీకొడుకులు మాట్లాడితే చిన్న పిల్లలు టీవీలు చూసే పరిస్థితి లేదని విజయశాంతి చురకలంటించారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ డాన్ అంటూ వ్యాఖ్యానించారు.

మహిళలకు ఎక్కడైనా లిక్కర్ అనే ఆలోచన వస్తుందా? అని ప్రశ్నించారు. కవితను ఈడీ, సీబీఐ పిలిస్తే వెళ్లడం లేదని.. తప్పు చేసి మహిళ అని తప్పించుకుందామని అనుకుంటున్నారని విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మొత్తం క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులేనని ఆరోపించారు. డ్రగ్స్ కు ఈ రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు.












Click it and Unblock the Notifications